ఆర్మూర్, ఏప్రిల్ 1: జిల్లాలో ప్రభుత్వ వెంచర్లు ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల వెంట గల ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తిస్తున్నట్లు నిజామాబాద్ అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఆర్మూర్ తహసీల్ కార్యాలయంలో జాతీయ రహదారులు 44, 63 వెంట ఉన్న పె ర్కిట్, చేపూర్ రైతులతో జాయింట్ కలెక్టర్ శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న వెంచర్ల ద్వారా అమ్మకాలకు ఆస్కారం లేని రైతుల అసైన్డ్ భూముల్లో ఎకరానికి సుమారు 250 నుంచి 400 గజాల స్థలాన్ని రైతులకు ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులకు ఇచ్చే 250 నుంచి 400 గజాల స్థలాలు అమ్ముకునేందుకు వారికే అధికారం ఉంటుందన్నారు. రైతులు కోరితే రెవెన్యూ అధికారులే ఆ స్థలాన్ని అమ్మి రైతులకు నగదును చెల్లిస్తారని తెలిపారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 44వ నంబర్ జాతీయ రహదారి వెంట ఉన్న 288 సర్వే నంబర్లో సుమారు 46 ఎకరాలకు సంబంధించిన రైతులకు, ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో 63వ నంబర్ జాతీయ రహదారి వెంట సర్వే నంబర్ 371/1లో 81 ఎకరాల స్థలానికి సంబంధించిన రైతులకు రెవెన్యూ అధికారులు అవగాహన కల్పించారు. రైతులకు సంబంధించిన భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేయడంతో కలిగే లబ్ధిని అధికారులు వివరించారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్, త హసీల్దార్ వేణుగోపాల్గౌడ్, చేపూర్ సర్పంచ్ టీసీ సాయన్న, కౌన్సిలర్లు లిక్కి శంకర్, పాలెపు లతా రాజు తదితరులు పాల్గొన్నారు.