విద్యానగర్, డిసెంబర్ 31 : రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలను ప్రతిరోజూ శుభ్రం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం ఆయన వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్త సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్కు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైకుంఠధామంలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ నిధుల ద్వారా జిల్లాల్లో గ్రామ పంచాయతీ భవనాలు కొత్తగా మంజూరయ్యాయని, త్వరలో పనులను ప్రారంభించాలని సూచించారు. ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లో పెండింగ్లో ఉన్న చెక్కులు, ట్రెజరీలో పెండింగ్లో ఉన్న చెక్కులను ఇటీవల పీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు పూర్తి చేసినట్లయితే వాటి వివరాలు సమర్పించాలన్నారు.
ట్రెజరీ చెక్కులను పీఎఫ్ఎంఎస్లో ఇక నుంచి జనరేట్ చేయవద్దని సూచించారు. ఎస్ఎఫ్సీ నిధులు త్వరలో విడుదలవుతాయని తెలిపారు. ట్రెజరీ చెక్కులు పెండింగ్లో ఉన్న వాటిని క్లియర్ చేయాలన్నారు. నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ తీర్మానాన్ని అనుసరించి ఏ పేమెంట్ అయినా పీఎఫ్ఎంఎస్ నుంచి జనరేట్ చేయవచ్చని వివరించారు. సర్పంచులకు మండల స్థాయి అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. వీసీలో రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్, సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీఆర్డీవో సాయన్న, జడ్పీ సీఈవో సాయగౌడ్, డీపీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.