కోటగిరి, నవంబర్ 28: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కోళ్ల పెంపకం ప్రధాన ఆదాయంగా ఉండేది. రానురానూ నాటుకోళ్లు కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈక్రమంలో నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నది. పేద, మధ్యతరగతి వారికి సబ్సిడీపై కోడిపిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నది. నాటుకోళ్లు తినడంతో పౌష్టికాహారం కూడా లభిస్తుందని భావించింది. నిజామాబాద్ జిల్లాకు 415 యూనిట్లు కేటాయించింది. ఒక్కో యూనిట్ రూ.1,850 కాగా, లబ్ధిదారుడు కేవలం రూ.600 చెల్లిస్తే చాలు.
ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.1,250 భరిస్తున్నది. ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారుడికి నాలుగు వారాల వయస్సు ఉన్న కోడిపిల్లలను ఇవ్వనున్నది. ఇవి పెరిగి పెద్దయ్యాక ఒక్కో కోడి జీవిత కాలంలో సరాసరి 160 నుంచి 200 గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. బాయిలర్ కోళ్ల కన్నా నాటుకోడి మాంసం రుచిగా ఉంటుంది. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ కోడి, గుడ్లు తినడం ద్వారా చిన్నారుల్లో దృష్టిలోపం నివారిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. నాటుకోళ్లను పెంచుకునే లబ్ధిదారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇప్పటి వరకు 35మందికి పైగా లబ్ధిదారులు నాటుకోళ్ల కోసం జిల్లా పశువైద్య కార్యాలయంలో డీడీలు చెల్లించారని జిల్లా పశువైద్యాధికారి జగన్నాథాచారి తెలిపారు.
వ్యవసాయం, పాడి తర్వాత స్థానం పెరటి కోళ్ల పెంపకానిది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచే విషయాల్లో మొదటగా చెప్పుకునేది పెరటికోళ్ల పెంపకమే. దేశవాళీ కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు. ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉండే కోళ్లను ఇంటి పరిసరాల్లో పెంచుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో పెరటి కోళ్లను పెంచి ఆదాయం ఇంటి పరిసరాల్లో పెంచుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఆదాయం సాధించేందుకు సర్కారు సైతం ప్రోత్సహిస్తున్నది.
దరఖాస్తు చేసుకోవాలి..
పెరటి కోళ్లు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలి. కోటగిరి మండలానికి 22 యూనిట్లు మంజూరయ్యాయి. పెరటి కోళ్లపై ఆసక్తి గల వారి కోసం ఇప్పటికే మండలంలోని వివిధ గ్రామాలకు సమాచారం ఇచ్చాం. ఆసక్తి గల వారు సంబంధిత పశువైద్యశాలలో దరఖాస్తులు అందజేయాలి.
– డాక్టర్ సురేశ్కుమార్, పశువైద్యాధికారి, కోటగిరి