విద్యానగర్, డిసెంబర్ 10 : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తున్నది. పేద ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవడానికి ప్రతి ఏటా క్రిస్మస్ గిఫ్టులను అందజేస్తున్నది. ఇందులో భాగంగా మహిళలకు బతుకమ్మ చీరలు, ముస్లిములకు రంజాన్ తోఫా, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులను ఏటా పం పిణీ చేస్తున్నది. ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు కానుకను అందించాలని నిర్ణయించింది. అందుకోసం పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లు అందించేందుకు చర్యలు చేపట్టింది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవ ర్గాల కు వెయ్యి చొప్పున గిఫ్టులు జిల్లా కేంద్రానికి చేరాయి. ఈ కానుకలు జిల్లా కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో అధికారులు భద్రపరిచారు. వీటిని మండలాల వారీగా అధికారులతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో చర్చీల నిర్వాహకులు గుర్తించిన పేదలకు పంపిణీ చేయనున్నారు.
జిల్లాకు 4 వేలు గిఫ్టులు….
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు వెయ్యి చొప్పున 4 వేల క్రిస్మస్ గిఫ్టులు జిల్లా కేంద్రానికి చేరాయి. ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాకులను అందించనున్నారు. ఈ ప్యాకెట్లో ఒక చీర, పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్టు ఉన్నాయి. కుటుంబంలోని తల్లిదండ్రులకు, కుమార్తెకు ఈ దుస్తులు ఇవ్వనున్నారు. క్రిస్మస్ పండుగ రోజు కొత్త బట్టలు కొనుక్కోలేని నిరుపేదలకు ఈ కానుక వరంగా మారింది. సీఎం కేసీఆర్అన్ని వర్గాల పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అన్ని మతాల ప్రజలు వారి పండుగలను సంతోషంగా జరుపుకొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మతాల వారి ప్రార్థనా మందిరాలను ఆధునీకరించేందుకు సైతం నిధులు విడుదల చేస్తున్నారు. ఈ గిఫ్టులను ఆయా నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
క్రిస్మస్ కానుకలు సిద్ధంగా ఉన్నాయి..
పేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పంపిణీ చేయడానికి 4 వేల క్రిస్మస్ కానుకలు వచ్చాయి. క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీ గుర్తించిన పేదలకు క్రిస్మస్ పండుగకు ముందు ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఈ కానుకలను పంపిణీ చేస్తాం.
-దయానంద్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి, కామారెడ్డి