ఖలీల్వాడి : గీతావృత్తిని ఆధునీకరించి పరిశ్రమగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ వీజీగౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ గీత పనివారాల సంఘం మూడవ జిల్లా మహాసభను ఆయన ప్రారంభించారు. కామ్రేడ్ ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వీజీగౌడ్ మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. తెలంగాణ గీత పని వారాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ.. కల్లును శీతల పానీయంగా అభివృద్ధి చేయాలని, ఫామ్కోలా, చక్కెర, తాటి బెల్లం తదితర వస్తువులను కల్లు నుంచి ఉత్పత్తికి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.
దేవతల సురాపానంగా భావించి సేవించిన కల్లు అమృతం లాంటిదని, కల్లులో అరవై మూడు రకాల పోషక విలువలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారని వెల్లడించారు. కల్లు ఆరోగ్యానికి చాలా మంచిదని, అలాంటి కల్లుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రతి జిల్లాలో నీరా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. కార్యక్రమంలో నాయకులు భూమాగౌడ్, విఠల్ గౌడ్, తెలంగాణ గీతా పనివారాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిలు గౌడ్, రాష్ట్ర కోశాధికారి బొమ్మగాని, నాగభూషణం, నాయకులు కేవీఎల్, సీపీఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్, భూమయ్య గౌడ్, రాజగౌడ్, సంతోష్ గౌడ్, శ్రీగద స్వామి గౌడ్, సాయిబాబా గౌడ్, మల్లేశ్ గౌడ్, లాలా గౌడ్, తిరుమలేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.