బోధన్, అక్టోబర్ 4 : భారత – చైనా సరిహద్దులో విధి నిర్వహణ పూర్తి చేసుకుని పశ్చిమబెంగాల్లోని తమ క్యాంప్నకు తిరుగుప్రయాణంలో వరదల్లో సైనిక అధికారులు, సైనికులు గల్లంతైన విష యం తెలిసిందే. ఇందు లో సాలూరా మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన నీరడి గంగాప్రసాద్ ఉన్నట్లు సైనిక అధికారులు కుటుంబీకులు బుధవారం తెలిపారు. దీంతో గంగాప్రసాద్ కుటుంబీకులతోపాటు గ్రామస్తుల్లో ఆందోళన నెలకొన్నది.
భారత – చైనా సరిహద్దుకు పశ్చిమబెంగాల్లోని క్యాంప్ నుంచి లాన్స్నాయక్ గంగాప్రసాద్ బృందం కొద్దిరోజుల క్రితం వెళ్లింది. అక్కడ విధి నిర్వహణను ముగించుకొని వస్తూ.. రెండు రోజుల క్రితం రాత్రి సిక్కిం రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ఆ బృందం బస చేసింది. వీరు బసచేసిన పక్కనే నది ఉండడం, భారీవర్షాలకు ఆకస్మికంగా వరదలు రావడంతో చూస్తుండగానే.. 23 మంది సైనికులు, సైనిక అధికారులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. సైన్యంలో గంగాప్రసాద్ లాన్స్నాయక్ ర్యాంక్తో పనిచేస్తున్నారు. గంగాప్రసాద్కు తండ్రి కాశీరాం.. గతంలో వీఆర్వోగా పనిచేసి, ప్రస్తుతం బోధన్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గంగాప్రసాద్కు తల్లి, తమ్ముడు సాయిసుధాకర్ ఉన్నారు. 2015లో శిరీషను వివాహం చేసుకున్న గంగాప్రసాద్కు 3, 7 సంవత్సరాల వయస్సున్న కుమారులు ఉన్నారు.
బాధిత కుటుంబసభ్యులు వెళ్లేందుకు విమానం టిక్కెట్లు బుక్ చేసిన షకీల్ లాన్స్నాయక్ గంగాప్రసాద్ కుటుంబసభ్యులను సిక్కిం ప్రాంతానికి పంపేందుకు బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ చేయూతను అందించారు. గంగాప్రసాద్ గల్లంతయిన విషయమై ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి సరిహద్దులోని బార్డోగ్రా ప్రాంతానికి వెళ్లేందుకు విమానం టిక్కెట్లను తన సొంత ఖర్చుతో బుక్చేశారు. గంగాప్రసాద్ గల్లంతయిన ప్రాంతానికి ఆయన సోదరుడు సాయి సుధాకర్, బంధువు దిలీప్.. కుమ్మన్పల్లి నుంచి బయల్దేరారు.