బాన్సువాడ, ఆక్టోబర్ 13 : పంటపొలాలవద్ద , రోడ్ల వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైరును దొంగలిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ జగన్నాథరెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో రూరల్ సీఐ మురళి, సిబ్బందితో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. శుక్రవారం ఉదయం నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్రావుపల్లి ఎక్స్రోడ్డు సమీపంలో ఎస్సై రాజశేఖర్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో సంగారెడ్డి వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న వ్యాన్ను ఆపడానికి యత్నించగా వారు నాందేడ్ వైపు పారిపోయేందుకు యత్నించారు. దీంతో వ్యాన్ను వెంబడించి పట్టుకున్నారు. వ్యాన్లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన షాబుద్దీన్, షేక్ ఖలీం, మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా కాసర్ బాల్కుడాకు చెందిన రబ్బానీ ఉస్మాన్ చౌదరి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బైలాల్పూర్ గ్రామానికి చెందిన ముక్త్యార్ అహ్మద్ను అదుపులోకి తీసుకున్నారు.
వీరంతా దగ్గరి బంధువులు. వీరు ముఠాగా ఏర్పడి కలిసి సంవత్సర కాలంగా కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాచకొండ జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్లోని కాపర్వైర్ చోరీలకు పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం, మద్నూర్, భిక్కనూర్తో పాటు ఇతర పోలీసు స్టేషన్ల పరిధిలో రహదారులకు దగ్గరగా, ఉండే పొలాల వద్ద ఉండే ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడ్డారు. ఐదు జిల్లాల్లో దొంగలించిన రాగి వైరును గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకున్నారు. మిగిలిన 10.50 క్వింటాళ్ల కాపర్ వైరును వ్యాన్లో నాందేడ్కు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కాపర్ వైరు విలువ సుమారు రూ.8.50 లక్షల వరకు ఉంటుంది. వీరు ఇప్పటి వరకు 37 కేసుల్లో 62 ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరును దొంగిలించారని డీఎస్పీ తెలిపారు. వ్యాన్తో పాటు రాగి వైరును స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
గతంలో సైతం సుమారు 9 క్వింటాళ్ల కాపర్ దొంగలించిన ముఠాను పట్టుకున్నామని వివరించారు. అనతి కాలంలో మరో అంతర్రాష్ట్ర ముఠాను రూరల్ సీఐ మురళి, నిజంసాగర్ ఎస్సై రాజశేఖర్, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, ఏఎస్సై రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ సురేందర్, సీసీఎస్ కానిస్టేబుళ్లు గణపతి, రాజు, రవి, ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, నిజాంసాగర్, పిట్లం సిబ్బంది శ్యాం, సుభాష్, ఎస్కే వసి, రాజు, ఓంకార్, శంకర్, హోంగార్డు సంగమేశ్వర్, ఆంజనేయులు, రాజేశ్కు ఎస్పీ అభినందిస్తూ క్యాష్ రివార్డు ప్రకటించగా .. వాటిని డీఎస్పీ చేతుల మీదుగా సిబ్బందికి అందజేశారు.