పార్వతీ తనయుడు గంగమ్మ ఒడికి చేరాడు. విశేష పూజలందుకున్న ఏకదంతుడు సెలవు తీసుకున్నాడు. ఉమ్మడి జిల్లాలో గణేశుడి శోభాయాత్ర వైభవోపేతంగా సాగింది. ఊరూరా పండుగ వాతావరణం నెలకొన్నది. డప్పుచప్పుళ్లు, బ్యాండుభాజాలు, డీజే సౌండ్లు, యువత నృత్యాలతో శోభాయాత్ర ఆద్యంతం సందడిగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై లంబోదరుడ్ని ఉంచి ఊరేగించారు. వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా అని వీడ్కోలు పలుకుతూ.. చెరువులు, జలాశయాల్లో నిమజ్జనం చేశారు.
పదకొండు రోజులపాటు ఘనమైన పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. జిల్లా కేంద్రంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాలు, మండల కేంద్రాల్లో గురువారం గణేశ్ నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయాత్రలను తిలకించేందుకు వచ్చిన భక్తులతో రోడ్లన్నీ కోలాహలంగా మారాయి. డీజేలు, బ్యాండు మేళాలు, నృత్యాలతో సందడి నెలకొన్నది. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో తాగునీరు, పండ్లు పంపిణీ చేశారు.
అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారుల పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బాసర గోదావరిలో విగ్రహాల నిమజ్జనం కోసం బ్రిడ్జిపై ఐదు క్రేన్లను ఏర్పాటు చేశారు. లైటింగ్ సౌకర్యం కల్పించారు, వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. బోధన్లో శోభాయాత్రతోపాటు మిలాద్-ఉన్-నబీ ఏర్పాట్లను సీపీ సత్యనారాయణ పరిశీలించారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 28