ఎల్లారెడ్డి, జూన్ 30: కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేసిన గాంధారి ఎస్సై మహేందర్ తీరు ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాంధారిలో అధికార పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన జెండాకు సెల్యూట్ చేస్తున్న ఫొటో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా మారారన్న ఆరోపణలకు తాజా ఉదంతం మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో పోలీసుల వ్యవహార శైలిపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఆధ్వర్యంలో సోమవారం గాంధారిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆఫీసు ఆవరణలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు జెండాకు వందనం చేసిన సమయంలో అక్కడే ఉన్న ఎస్సై మహేందర్ కూడా జెండాకు వందనం చేశారు. ఈ ఫొటో కాస్త మంగళవారం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ జేబు సంస్థగా మారిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యర్తల్లా వ్యవహరిస్తున్నారనేందుకు గాంధారిలో జరిగిన ఘటననే నిదర్శనమన్నారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే విచారణ జరిపి, ఎస్సై మహేందర్పై తగిన చర్యలు తీసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తాబేదార్లుగా పని చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా విధులు నిర్వహించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించే పరిస్థితికి కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిందని మండిపడ్డారు. గాంధారిలో ఎమ్మెల్యే కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఎస్సై మహేందర్ జెండావందనం తీవ్ర అభ్యంతరకరమన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పోలీసు అధికారి రాజకీయ పార్టీ జెండాకు సెల్యూట్ చేయడం, కాంగ్రెస్ పార్టీ పోలీస్ వ్యవస్థను వారికి అనుకూలంగా మలచుకొని ఎంతగా నిర్వీర్యం చేసిందో స్పష్టం అవుతుందన్నారు. ఇటువంటి చర్యలు పోలీసు వ్యవస్థ నిష్పాక్షికతపై అనుమానాలు కలిగిస్తాయన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, ఇతరులపై అధికార పార్టీ ఆదేశాల మేరకు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల తీరు ప్రజాస్వామ్యనికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేలా పోలీసులు వ్యవహరించడం బాధాకరమన్నారు.
– మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
గాంధారిలో కాంగ్రెస్ పార్టీ జెండాకు సెల్యూట్ చేసిన ఎస్సై మహేందర్ను సస్పెండ్ చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు అధికారులు పార్టీ కండువాలు కప్పుకున్నట్లుగా పని చేస్తున్నారన్నారు.
– ఎల్లారెడ్డి మాజీ ఎమ్మేల్యే జాజాల సురేందర్