పిట్లం/నిజాంసాగర్, ఏప్రిల్ 16: హనుమాన్ మాలధారణ సమయంలో మంచి మిత్రులుగా మారిన ఆ యువకుల స్నేహబంధం మృత్యువులోనూ వీడలేదు. పిట్లం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృత్యువాత పడ్డారు. ఎస్సై విజయ్కొండ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లి గ్రామానికి చెందిన జలంధర్గౌడ్(20), సుబ్బురి రాజు(35) స్నేహితులు. సరుకులు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు వారు శనివారం పిట్లం మండలకేంద్రానికి బైక్పై వెళ్లారు. పనులు ముగించుకొని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా 161వ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్లో పిట్లం ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అప్పటికే వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డి, హైదరాబాద్కు తరలించగా ఆదివారం వేకువ జామున ఇరువురూ మృతిచెందారు. రాంగ్ రూట్లో బైక్ నడుపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
హనుమాన్ మాలధారణతో స్నేహం..
జలంధర్గౌడ్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. ఆయన ఇటీవల గ్రామంలోని పలువురితో కలిసి హనుమాన్ మాలను ధరించాడు. ఒక సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి ఉండేవారు. నిత్యం స్థానిక ఆలయం వద్ద పూజలు చేసేవారు. ఈ క్రమంలో సుబ్బురి రాజు, జలంధర్ గౌడ్కు మంచి స్నేహం ఏర్పడింది. వారం క్రితమే మాలధారణ పూర్తయ్యింది. దీంతో మరో రెండు రోజుల్లో జలంధర్గౌడ్ తన జాబ్ కోసం హైదరాబాద్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇద్దరు కలిసి శనివారం ద్విచక్రవాహనంపై పిట్లం మండల కేంద్రానికి వెళ్లి వస్తుండగా లారీ ఢీకొట్టింది.
భారీగా తరలివచ్చిన మిత్రులు..
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జలంధర్గౌడ్, సుబ్బురి రాజుకు పిట్లంలో ముందుగా ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సంగారెడ్డికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్బురిరాజు ఆదివారం వేకువజామున మృతి చెందాడు. జలంధర్గౌడ్ను హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తీసుకెళ్లగా ఆయన కూడా మృతి చెందాడు. వీరి అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం స్వగ్రామం నర్సింగ్రావు పల్లిలో నిర్వహించగా, మిత్రులతోపాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్నేహితుల మృతితో నర్సింగ్రావుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.