బోధన్, ఫిబ్రవరి 8: రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో బోధన్ పట్టణం అధ్వాన్నంగా మారిందని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన పట్టణంలోని 33,37, 29,28, 15, 16,32,30, 18 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో జరిగిన కార్నర్ మీటింగ్ల్లో షకీల్ మాట్లాడుతూ.. బోధన్ పట్టణానికి కొబ్బరికాయ ఖరీదైన 40 రూపాయలను కూడా ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తీసుకురాలేదని ధ్వజమెత్తారు.
ఒకవేళ ఆయన నిధులు తీసుకువచ్చినట్లు నిరూపిస్తే.. బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేస్తానని ఆయన సవాల్చేశారు. బోధన్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ కూడా బీఆర్ఎస్ పాలనలో జరిగినవేనని, తాను నిధులు మంజూరుచేసిన పనులకు ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవాచేశారు. మళ్లీ బోధన్ పట్టణం అభివృద్ధి చెందాలంటే మరోసారి మున్సిపాలిటీపై ప్రజలు గులాబీ జెండా ఎగురవేయాలని షకీల్ పిలుపు ఇచ్చారు.
బీఆర్ఎస్ పాలనలో పదవులు అనుభవించిన కొందరు పార్టీ ఫిరాయించి మళ్లీ ఈ ఎన్నికల్లో నిలబడుతున్నారని, అటువంటివారికి ప్రజలు గుణపాఠం నేర్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు జె.శంకర్గౌడ్, నియోజకవర్గం నాయకులు నర్సింగ్రావు, గోగినేని నర్సయ్య, లింగారెడ్డి, భవానీపేట్ శ్రీనివాస్, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.