ఆర్మూర్టౌన్, డిసెంబర్ 12: ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపవన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును మంగళవారం కలిసి నోటీసు అందజేయడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ వినీత, భర్త పవన్, మరిది ప్రేమ్ తీరుపై సొంత పార్టీ కౌన్సిలర్లే కొంతకాలంగా అసహనంతో ఉన్నారు. గతంలోనూ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధం కాగా.. మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అయినప్పటికీ వారి తీరులో మార్పు రాకపోవడంతో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కౌన్సిలర్లు సిద్ధమయ్యారు.
ఈ మేరకు మంగళవారం కలెక్టర్కు నోటీసు అందజేశారు. బీఆర్ఎస్కు చెందిన 30 మంది కౌన్సిలర్లలో 24 మంది ఈ మేరకు సంతకాలు చేశారు. రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. ఒక వేళ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గి ఎన్నికలు నిర్వహించినా.. పదవీకాలం ఆరు నెలల ముందుగానే చెక్ పవర్ రద్దు అయ్యే అవకాశం ఉండడంతో ఎవరు ముందుకు వస్తారో అని చర్చ జోరుగా సాగుతున్నది. ఒకవేళ కలెక్టర్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకపోయినా, ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూసినా ప్రత్యేక అధికారి పాలన తప్పదు.