ఖలీల్వాడి, జూన్ 26: ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’కు ప్రతి ఒక్కరూ సహకరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా సూచించారు. ‘సర్’లో భాగంగా శుక్రవారం ఆయన బీఎల్వో నుంచి ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఓటరూ తమకు అందిన ఎన్యూమరేషన్ పత్రాన్ని పూర్తిగా, సరైన వివరాలతో నింపి అవసరమైన ధ్రువ పత్రాలను జతచేసి, నిర్ణీత గడువులోగా బీఎల్వో లేదా ఎన్నికల అధికారులకు అందజేయాలని కోరారు. ఓటు హక్కు ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. చిన్న నిర్లక్ష్యంతో భవిష్యత్తులో ఓటు నమోదు, సవరణ లేదా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదని తెలిపారు.
వివరాలను సక్రమంగా నమోదు చేయించాలని సూచించారు. ఎన్నికల సంఘానికి సహకరిస్తూ ఈ సర్వేను విజయవంతం చేయాలని, బంధువులు, స్నేహితులు పొరుగువారిలో కూడా అవగాహన కల్పించి ప్రతిఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించేలా సహకరించాలని బిగాల విజ్ఞప్తి చేశారు.