ఖలీల్వాడి, మార్చి 27: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఢిల్లీ పెద్దలకు రాష్ట్రం నుంచి ముడుపులు పంపిస్తున్నారని, వారి చేతిలోనే రాష్ట్రం రిమోట్ ఉందని విమర్శించారు. అవినీతికి పుట్టిన కవల పిల్లలు బీజేపీ, కాంగ్రెస్ అని మండిపడ్డారు. బుధవారం ఆయన నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 111 రోజులైనా సక్రమంగా అమలుచేయడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాక్షస పాలన అందిస్తున్నాయని విమర్శించారు. మోదీకి నచ్చిన వాళ్లు జేబులోకి, నచ్చని వారిని జైల్లోకి పంపించడం ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. ఈడీని మోదీ తన జేబు సంస్థగా వాడుకుంటున్నారని ఆరోపిం చారు. కవితను అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఇతర పార్టీల వారిని బెదిరించి వారి పార్టీలో చేర్చుకుంటున్నారని జీవన్రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ మున్సిపల్తోపాటు డీసీసీబీని కైవసం చేసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ ఎవరినీ బెదిరించకుండా పాలన సాగించినట్లు ఆయన గుర్తుచేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి చీప్ లిక్కర్ అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలను పాడుచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి కాళేశ్వరం సక్రమంగా నిర్మించలేదని, ఫోన్ ట్యాపింగ్ అంటూ కాలయాపన చేస్తున్నదని జీవన్రెడ్డి మండిపడ్డారు.