వేల్పూర్, నవంబర్ 25: సర్వే పేరుతో గోప్యత హక్కుకు విరుద్ధంగా ప్రజల ఆస్తులు, అంతస్తులు, వాహనాలు, ఇతర స్థిర, చరాస్తులు ఎలా సేకరిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను తప్పుబట్టిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇప్పుడు సర్వే ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని తన నివాసానికి సోమవారం సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు వేముల.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్రెడ్డి సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు సర్వే వద్దని మాట్లాడిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఎందుకు సర్వే చేయిస్తున్నారని ప్రశ్నించారు. తనకు వివరాలు ఇవ్వటానికి అభ్యంతరం లేదన్న ప్రశాంత్రెడ్డి.. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను తప్పు అంటూ వివరాలు సేకరించటానికి అడ్డమైన వాళ్లను ఇంటికి పంపిస్తారంటూ రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే వ్యక్తిగత వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులకు విరుద్ధంగా ఆస్తులు, అంతస్తులు, వాహనాలు తదితర స్థిర, చరాస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. గడువులోపు సర్వే పూర్తి చేయాలనే ఆతృతలో తప్పులు దొర్లే ప్రమాదముందని పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సర్వే ద్వారా సరైన న్యాయం దక్కేలా వివరాలు నమోదు చేయాలని సూచించారు. సర్వే పేరిట టీవీ, ఫ్రిడ్జ్, స్కూటర్ లాంటి సాధారణ అంశాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజల తరఫున పోరాటం చేస్తామని వేముల హెచ్చరించారు.