బాన్సువాడ టౌన్, మే 7 : తెలంగాణ అవతరించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సమన్యాయం జరుగుతున్నదని, అన్ని వర్గాల ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గంగా జమున తెహజీబ్ లాగా అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండాలని సూచించారు. బాన్సువాడ పట్టణం ఇస్లాంపురలో ఆదివారం జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనదేశం భిన్న సంస్కృతులకు నిలయమని అన్నారు.
మానవ జన్మ చాలా పవిత్రమైనదని, నలుగురికీ సహాయపడుతూ మనకు సాధ్యమైనంత మంచి జీవనం గడపాలని అన్నారు. మనం ఈ లోకాన్ని వదిలివెళ్లినా మనపేరు బతికే ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేశామని, బాన్సువాడలో నూతనంగా ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాలను కూడా ప్రారంభించినట్లు వివరించారు. ఇస్లాంపురలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కార్యక్రమంలో జమాతే ఇస్లాం హింద్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎంఏ అజీం, కార్యవర్గ సభ్యులు గౌస్, రెహమాన్, బాన్సువాడ, బోధన్ అధ్యక్షులు హఫీజ్, ఫారూకీ, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, బీఆర్ఎస్ నాయకులు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.