కామారెడ్డి,జనవరి 19: ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రహదారి భద్రత, జీవన రక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగి అమూల్యమైన జీవితాలను కోల్పోవాల్సి వస్తున్నదని అన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని, మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపొద్దని ఆయన సూచించారు.
అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జయప్రదం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. శుక్రవారం అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని అతిథులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానలేఖలను పంపాలన్నారు. సీటింగ్ ఏర్పాట్లు చక్కగా చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. లైటింగ్, పూలతో కలెక్టరేట్ను అందంగా అలంకరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, అదనపు ఎస్పీ నారాయణ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.