తొమ్మిది గేట్ల ద్వారా నీటి విడుదల
మెండోరా, జూలై 19 : ఎస్సారెస్పీకి వరద ఉధృతి తగ్గిందని ప్రాజెక్టు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టు లోకి 49,380 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోందని చెప్పారు. మంగళవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు 26,985 క్యూసెక్కుల మిగులు జలాలను వదిలినట్లు పేర్కొన్నారు. కాకతీయ కాలువకు 3,500 క్యూసెక్కులు, వరదకాలువకు ఐదు వేలు, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 2,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు.ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి 151.394 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. దీంతో మిగులు జలాలను దిగువ గోదావరి, కాకతీయ కాలువ, వరదకాలువలకు 95.038 టీఎంసీలు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 1088.02 అడుగుల (77..63 టీఎంసీలు) వద్ద ఉన్నదని తెలిపారు.
నిజాంసాగర్లోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువప్రాంతం నుంచి 2820 క్యూసెక్కుల వరద ఇన్ఫ్లోగా వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, మంగళవారం సాయంత్రానికి 1401.35 అడుగుల (12.89 టీఎంసీలు) వద్ద ఉన్నదని ప్రాజెక్టు ఏఈ శివకుమార్ తెలిపారు.