వరద గేట్ల మూసివేత
మెండోరా, జూలై 20 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గింది. బుధవారం ఉదయం నుంచి క్రమంగా 59,380 క్యూసెక్కుల నుంచి 36 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో తగ్గిందని ఏఈఈ రవి తెలిపారు. దీంతో మధ్యాహ్నం 2.30 గంటలకు వరద గేట్లను మూసివేసినట్లు తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి మాత్రమే గోదావరిలో నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ సీజన్లో ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 160 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. దిగువన గోదావరిలోకి కాకతీయ, వరద కాలువల ద్వారా 98 టీఎంసీల మిగులు జలాలను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కాకతీయ కాలువకు 3,500 క్యూసెక్కులు, వరదకాలువకు 10వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 2,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, బుధవారం సాయంత్రానికి 1088.40 అడుగుల (77.702 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉన్నదని తెలిపారు.
నిజాంసాగర్లోకి కొనసాగుతున్న వరద..
నిజాంసాగర్, జూలై 20 : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతున్నది. బుధవారం సాయంత్రానికి 2,280 క్యూసెక్కుల వరద వస్తున్నదని ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1401.51 అడుగుల (13.08 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నదని తెలిపారు.