మెండోర : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గ్రామాలల్లో పంట పొలాలను వరద నీరు ముంచెత్తడంతో చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్ బుధవారం బోధన్ మండలంలోని గోదావరి తీర ప్రాంతాలను పరిశీలించారు. దిగువ గోదావరిలోకి 33 వరద గేట్లతో 4,49,820క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల నుంచి 3500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కాకతీయకు 3వేలు, వరద కాలువకు 5,105 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందని ఈఈ పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1087.80 అడుగులు (75.785 టీఎంసీల ) నీటి నిల్వ ఉందన్నారు. ఈ సీజనులో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్ నుంచి 409.744 టీఎంసీల వరద నీరు వచ్చిందని ఆయన వెల్లడించారు.