నిజామాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరెంట్ ఎప్పుడొస్తదో తెలిసేది కాదు.. ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. మోటర్ల కాడ రైతులు పొద్దూమాపు పడిగాపులు కాసేటోళ్లు. కరెంట్, నీళ్లు రాక ఎండిపోతున్న పంటలను చూసి కన్నీళ్లు పెట్టుకునేటోళ్లు. ఎవుసం మానేసి.. పెండ్లాంబిడ్డలను వదిలి ఎడారి దేశాలకు వలస పోయేటోళ్లు.. ఇది గతం.. ఆనాడు తెలంగాణ పల్లెల దుస్థితి అంతా దుఃఖభరితం.. అదే బీడు వారిన తెలంగాణ ఇప్పుడు పచ్చబడ్డది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సాగు సంబురమైంది. 24 గంటలపాటు ఉచిత కరెంట్ సరఫరాతో సరికొత్త చరిత్ర మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, పెట్టుబడి సాయంతో పల్లెపల్లెనా పచ్చదనం సంతరించుకున్నది. పంటల దిగుబడి రెట్టింపు కావడంతో రైతుల ముఖాల్లో సంతోష కాంతులు వెల్లివిరుస్తున్నాయి. వలసలు పోయే దుస్థితి తొలగి పోయింది. పొరుగు రాష్ర్టాల నుంచి వలస వచ్చే వారికి ఉపాధి కేంద్రంగా మారింది. ఇదీ వాస్తవం. కండ్ల ముందు కనిపిస్తున్న యథార్థ దృశ్యం.. సరిగ్గా ఐదేండ్ల క్రితం అమలులోకి వచ్చిన ‘24 గంటల ఉచిత కరెంట్’ అందించిన అద్భుత విజయం.
జనవరి ఒకటో తారీఖు వచ్చిందంటే చిన్నా పెద్దా అంతా ఎగిరి గంతులేస్తుంటారు. కొత్త సంవత్సరం ఆరంభ వేళ సంబురాల్లో మునిగి పోతుంటారు. అయితే, జనవరి 1.. నూతన సంవత్సరం ఆరంభం రోజంటే తెలంగాణ రైతన్నలకు మాత్రం ప్రత్యేకం.. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ప్రారంభమైన రోజు. సాగు కష్టాలకు చరమగీతం పాడిన రోజు. సరిగ్గా ఐదేండ్ల క్రితం.. 2018 జనవరి 1వ తేదీ నుంచే రాష్ట్రంలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ పథకం ప్రారంభమైంది. చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ రైతులకు నిరంతర వెలుగులను అందించింది. సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ అమలైన రోజది. నిరంతరంగా సాగుతున్న ఈ అద్భుత పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకుని ఆరో ఏటా అడుగిడుతున్నది. సీఎం కేసీఆర్ చేసిన మేలుతో రాత్రీపగలూ వ్యవసాయానికి కరెంట్ అందుతున్నది. బోర్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుండడంతో పొలాలన్నీ పచ్చబడ్డాయి. బీడు భూములూ సాగులోకి వచ్చాయి. యాసంగిలోనూ ఢోకా లేకుండా రైతన్నలు పంటలు వేస్తున్నారు. ఏడాదిలో రెండు కాలాలపాటు చేతి నిండా పని, పొలాల నిండా పంటలతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాఫీగా త్రీఫేజ్ కరెంట్..
రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ ప్రాంతం విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడింది. సాగుకు 6 గంటల కరెంట్ అది కూడా 2, 3 లేదా 4 విడుతలుగా వచ్చేది. ఆ కరెంట్తో పంటలు సరిగా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరిగోస పడేవారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చే త్రీఫేజ్ కరెంట్ కోసం పొలాల వద్ద పడిగాపులు కాసే వారు. ఒక్కసారిగా మోటర్లు స్టార్టవ్వడంతో ఎగిరిపోయిన ప్యూజులను మార్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులెందరో. ఇలా సమైక్య పాలనలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. పేరుకు తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా అయినప్పటికీ, ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో ఎవరికీ తెలియని పరిస్థితి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పొలాల వద్దనే నిరీక్షించాల్సి వచ్చేది. అధిక ఒత్తిడితో పటాకుల్లా పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లతో ఆర్థికంగా రైతన్నలు అవస్థలు పడ్డారు. బోరుబావుల్లో సమృద్ధిగా నీరున్నా పంటలకు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే, కరెంట్ కష్టాలు తొలగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఐదేండ్లుగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా సవ్యంగా అందుతోంది. గతంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై అదనపు భారం పడి మోటర్లు కాలిపోయేవి. మోటరు కాలిపోతే వాటికి మరమ్మతులు చేయించాలంటే సగటున ఒక్కో రైతుకు రూ.2 వేల వరకు భారం అయ్యేది. చేసేది లేక అప్పు తీసుకువచ్చి రిపేర్లు బాగు చేయించేది. ఇప్పుడలాంటి ఘటనలే లేకుండా పోయాయి.
3లక్షలకు చేరువవుతున్న వ్యవసాయ కనెక్షన్లు…
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 7.73 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉంటే.. అందులో 1,75,765 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 3,74,046 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 95,901 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2,71,666 వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంట్ అందుతోంది. గతంలో పల్లెల్లో పండుగలు, ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు పగటి పూటా అరగంట కరెంట్ కోసం ఆపసోపాలు పడిన నేపథ్యం ఇప్పటికీ విద్యుత్ ఉద్యోగులు, ప్రజల మనసుల్లో స్పష్టంగా ఉంది. గృహ, వాణిజ్య వినియోగదారులకు పట్టణ, నగర ప్రాంతాల్లో 4-8 గంటలు, గ్రామాల్లోనైతే 12 గంటల వరకు ఏకబిగిన కరెంట్ కోతలుండేవి. పవర్ హాలీడేలు కొనసాగిన దుర్భర పరిస్థితుల నుంచి దేశం మొత్తమ్మీద తొలిసారిగా రైతులకు 24 గంటల ఉచితం విద్యుత్ అందించే స్థాయికి ఎదగడం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లింది. పవర్ జనరేషన్, అందుకు తగిన విధంగా సరఫరా, డిస్కమ్ల ద్వారా పంపిణీ.. ఇవన్నీ రెండింతలకు పైగా అభివృద్ధి చేసుకోవడం వల్లనే ఉచిత విద్యుత్ ఆటంకాల్లేకుండా సాగుతోంది. కారు చీకట్లు వీడిపోయాయి.. కరెంట్ కష్టాలు తొలగిపోయాయి. నిరంతర విద్యుత్ సరఫరాతో సాగు సంబురంగా మారింది. బీడు భూములకు కొత్త కళ వచ్చింది. ఏటేటా అంచనాలకు మించి పంటలు సాగవుతున్నాయి. రాష్ట్ర సర్కారు ప్రోత్సాహంతో దండిగా దిగుబడులు వస్తున్నాయి. కేసీఆర్ సంక్షేమ పాలనకు ఇదో గీటురాయి.
రైతు కుటుంబాలకు దేవుడు కేసీఆర్
తాడ్వాయి, డిసెంబర్ 31: నాకు నాలుగెకరాల భూమి ఉంది. రెండు చోట్ల కలిసి మూడు బోర్లు ఉన్నాయి. చెరువు, కాలువలు లేక పోవడంతో బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న. వరి, మక్కజొన్న, కూరగాయలు పండిస్తున్న. గతంలో కరెంట్ బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడేవాళ్లం.. ఇప్పుడు సీఎం -బోంది లింగం, రైతు, బ్రాహ్మణపల్లి, తాడ్వాయి మండలం
కరెంట్ లేదనే రంది పోయింది..
లింగంపేట: కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కాక మునుపు కరంట్కు మస్తు తిప్పలైతుండె. అప్పట్ల ఐదారు గంటలే ఎవుసానికి కరంట్ ఇస్తుండ్రి. పొద్దగాళ్ల కొద్దిసేపు, తెల్లందాకా కొద్దిసేపు ఇచ్చేటోళ్లు. కరంట్ కోసం పొలం కాడానే పండుకునేటోళ్లం. కానీ తెలంగాణ అచ్చినంక కరంట్ లేదనే రంది పోయింది. 24 గంటలూ ఉంటున్నది. నాకు టైం ఉన్నప్పుడు పొలం కాడికి పోయి మోటరు చాలు చేసుకుంటున్న. కరంట్ ఫ్రీగా ఇస్తున్న ముఖ్యమంత్రి సార్కు రుణపడి ఉంటాం.
– మన్నె బాలయ్య, శెట్పల్లి పొలం కాడనే పండుకుంటుంటి..
లింగంపేట: అప్పట్ల కరంట్ కోతలతోని మస్తు తిప్పలు పడ్డాం. మోటరు చాలు చేసేతందుకు పొలం కాడ పోయి పండుకోవాల్సి వస్తుండే. రాత్రి పోవాలంటే పురుగు పుషితోని భయమయ్యేది. ఇంటికి అచ్చేదాక పెల్లం, బిడ్డలు ఎదురు చూస్తుంటురి. అచ్చుడు అలస్యమైతే.. ఏమైందోనని ఇంటోళ్లు పొలం కాడికి ఉరికి వస్తుండే. కానీ కేసీఆర్ సార్ అచ్చినంక కరెంట్ తిప్పలు పోయినయ్. ఇప్పుడు ఫీరి కరంట్తోని పంటలు మంచిగా పండుతున్నయ్.
– చాకలి రమేశ్, శెట్పల్లిసంగారెడ్డి
రైతుల బాధలు తెలిసిన నాయకుడు కేసీఆర్ రైతులు పడుతున్న బాధలు తెలిసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్.తెలంగాణ రాష్ట్రం సాధించగానే రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ పథకాలను పెట్టారు. ఇందులో ముఖ్యమైనది వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంతో నాకు ఎకరం భూమి, మరో రైతు ఎకరం భూమి ఉండడంతో బోరు బావి ద్వారా వ్యవసాయం చేస్తున్న. నాలుగేండ్లుగా కరెంటును ఉపయోగించుకుంటూ వరి పంటను వానకాలం, యాసంగిలో పండిస్తున్న.
–పైడాకుల గంగారెడ్డి, రైతు, బ్రాహ్మణపల్లి, తాడ్వాయి మండలం