కోటగిరి, డిసెంబర్ 15 : నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని ఉన్నత చదువు కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆర్థిక చేయూత అందించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి. వర్ని మండలం పొట్టిగుట్ట తండాకు చెందిన మాలోత్ విఠల్ కుమార్తె మాలోత్ రేణుక హైదరాబాద్లోని మెడిసిటీ కళాశాలలో ఎంబీబీఎస్ వైద్య విద్యా కోర్సులో సీటు సంపాదించింది. కానీ ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రేణుక తండ్రి విఠల్ స్థానిక నాయకుల వద్ద తన ఆవేదనను వెలిబుచ్చాడు. అంతాపూర్ సర్పంచ్ పద్మా జగ్రాం, పొట్టిగుట్ట సర్పంచ్ శోభా యోగేశ్, ఉప సర్పంచ్ ప్రశాంత్, నాయకులు హీర్సింగ్.. ఈ విషయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన.. విద్యార్థిని వైద్య విద్యకు కావాల్సిన ఫీజును చెల్లించేందుకు అంగీకరించారు. ఐదు సంవత్సరాల చదువుకు గాను సుమారు 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలుసుకున్న సురేందర్రెడ్డి… మొదటి సంవత్సరం ఫీజు రూ.1,20,000 గురువారం చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఐదేండ్ల పాటు మిగతా రూపాయలను కూడా చెల్లిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు విషయాన్ని విద్యార్థినితో పాటు ఆమె తండ్రికి తెలిపి విద్యార్థినిని అభినందించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన విద్యార్థిని, వారి కుటుంబీకులు సురేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.