ఖలీల్వాడి, ఏప్రిల్ 19 : రైతు ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. ఆయన అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరగగా, ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ శాఖల పనితీరుపై సమీక్షించారు. జిల్లాలో 11.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని జిల్లా వ్యవసాయాధికారి తిరుమలప్రసాద్ సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం అందేలా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామసీమలు పచ్చదనం-పరిశుభ్రతను సంతరించుకున్నాయని, అందుకే జాతీయస్థాయిలో వరుస అవార్డులు వరిస్తున్నాయని హర్షాతిరేఖాలు వ్యక్తంచేశారు. పల్లెప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యమై గ్రామాలను మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కోరారు.
కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్ మాట్లాడుతూ ధాన్యం సేకరణ కోసం జిల్లావ్యాప్తంగా 467 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి 9 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కడ్తా, తరుగు పేరుతో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని సభ్యులకు భరోసా కల్పించారు. వానకాలం సాగుకు సంబంధించి ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. గత డిసెంబర్ 2021, జనవరి 2022లో కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతాంగానికి ప్రభుత్వం తరఫున మంజూరైన నష్టపరిహారం పంపిణీ చేస్తున్నామని, ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను కూడా ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. కొత్తపల్లి సహకార సంఘంలో అవినీతి అక్రమాలు జరిగాయని సభ్యులు ఆరోపించగా, సమగ్ర విచారణ జరిపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇసుక, మొరం తవ్వకాల ద్వారా సమకూరే సీనరేజీ నిధులను నిబంధనల మేరకు స్థానిక సంస్థలకు కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఉపాధి పనులు చేపట్టాలని, శిథిలమైన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయించాలని, విరివిగా పండ్ల మొక్కలు నాటించాలని సభ్యులు కోరారు. అంతకుముందు జడ్పీ కార్యాలయ స్థలంలో సుమారు రూ. 87 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యాపార సముదాయాన్ని జడ్పీ చైర్మన్, కలెక్టర్, మేయర్ నీతూకిరణ్ లాంఛనంగా ప్రారంభించారు. సమావేశంలో జడ్పీ సీఈవో గోవింద్, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, ఆయా మండలాల జడ్పీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు.