మోర్తాడ్, ఫిబ్రవరి 27: నిరుడి వరకు రందీలేకుండా యాసంగి పంటలు పండించిన రైతులు ఈఏడు ఆగమాగమవుతుండ్రు. అందుకు ఎండాకాలం వచ్చిరాగానే భూగర్భజలాలు అడుగంటిపోవడమే కారణం. చలికాలంలో కూడా ఎండ తీవ్రత ఉండడం, ఎండాకాలం ఆరంభంలోనే ఏసిన పంటలకు నీళ్లందించలేక, కరెంటు వస్తూ పోతుండడంలాంటి సమస్యలతో జిల్లాలో యాసంగి పంటల పరిస్థితి యాడికొస్తదోనని రైతు లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల నీళ్లు అందించలేక నేలలు నెర్రలీడిన పరిస్థితులు కనిపిస్తున్న తరుణంలో పంటలు చేతికొస్తయా లేక పశువుల మేతకైతయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలు, కరెంటు పరిస్థితులు ఎట్లుంటయో తెలియని అయోమయ పరిస్థితుల్లో చాలమంది రైతులు నిరుడు యాసంగిలో వేసిన పంటలకన్నా ఈసారి తగ్గించుకున్నారు. నువ్వు, సజ్జ పంటలు పండించే రైతులు సజ్జ వేస్తే నువ్వు, నువ్వు వేస్తే సజ్జ వేయలేని పరిస్థితి. కొంతమంది రైతులు వరి పంట విస్తీర్ణాన్ని కూడా తగ్గించుకున్నారు. మరికొంత మంది పంటవేసినా పూర్తిస్థాయిలో సరిపడా నీళ్లు లేక వేసిన పంటను వదిలేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాసంగి సాగుపై రైతన్న ఆగమాగమవుతుండు. మరోవైపు గత సంవత్సరం వ్యవసాయానికి విద్యుత్ రోజంతా ఇచ్చారని, కానీ ఇప్పుడు సరిపడా విద్యుత్ ఇస్తున్నా ఎప్పుడు పోతుందో? ఎప్పుడు వస్తుందో? తెలియని పరిస్థితుల్లో పైప్లైన్లు, మోటార్లు చెడిపోయే ప్రమాదం ఉన్నదని రైతులు వాపోతున్నారు.
నిరుడు ఐదెకరాల్లో వరి పండించిన. ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఈసారి కేవలం రెండున్నర ఎకరాల్లోనే వరి వేసిన. కానీ భూమిలో నీళ్లు లేక, కరెంటు సరిగ్గా ఉండక 30గుంటల పొలానికి నీళ్లు అందించలేకపోతున్న. 30 గుంటల పొలాన్ని పారియ్యకుంట ఇడిసిపెట్టిన. ఇప్పుడే గీ పరిస్థితి ఉంటే ముంగట ఎట్లుంటదో, ఏసిన పంటలకు నీళ్లు అందిస్తమో లేమోనన్న భయం ఉన్నది. ఈసారి యాసంగి పంటలతో నష్టాలపాలయ్యేటట్లే కనిపిస్తున్నది.
నిరుడు రెండెకరాల్లో వరి వేసిన. ఇప్పుడు మాత్రం ఒక ఎకరంలనే పంట వేసిన. నిరుటి వరకు పంటలకు నీళ్లు పారిచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండే. ఈసారి బోర్లు సరిగా పోస్తలేవు. కరెంటు వస్తూపోతూ ఉన్నది. ఎంజేయాల అర్థంగాక రెండెకరాలెందుకని ఎకరంలోనే వరి వేసిన, మరో ఎకరం సాగుజేయకుండా ఇడిసిపెట్టిన.