విద్యానగర్,జనవరి 5 : రైతుల భూములు ఎక్కడికి పోవు అని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ఫైనల్ కాలేదని, అభ్యంతరాలు ఉంటే రైతులు లిఖిత పూర్వకంగా ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇది ఫైనల్ కాలేదని అన్నారు. రైతుల పేరిట ధరణి పోర్టల్లో వారి పేర్లు ఉన్నాయని తెలిపారు. వారి భూములు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలని వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
ఓ రైతు తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడని, కావాలని ఈ విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారని అన్నారు. మాస్టర్ ప్లాన్పై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని, అన్నదాతలకు ఎలాంటి అన్యాయం జరగదు అని అన్నారు. ఉదయం నుంచి తాను అందుబాటులోనే ఉన్నానని తెలిపారు. తనకు ఇదే పని కాదని, ప్రజల సమస్యలతోపాటు ఇతర విషయాలపై కూడా పనిచేయాల్సి ఉంటుందన్నారు. వినతి పత్రం ఇవ్వడానికి 10 మంది వస్తే తీసుకునేవారమని, కానీ వందల మంది వస్తే ఎలా తీసుకుంటారని అన్నారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.