రామారెడ్డి, మే 24: కేంద్రానికి ధాన్యాన్ని తరలించి వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయడంలేదని ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో మాచారెడ్డి- అన్నారం ప్రధాన రహదారిపై ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు.
వడ్లు కొనుగోలు చేయడంలేదని, కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కొంతమందికి చెందిన రైతుల ధాన్యం కాంటా చేసినా లారీలు రావడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. లేనిపక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.