నందిపేట్, ఏప్రిల్ 30 : సొసైటీలకు తెచ్చిన వడ్లను కొనుగోలు చేయడంలేదని, ఒకవేళ కాంటా చేసినా.. రైస్ మిల్లులకు తరలించడంలేదని ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని అయిలాపూర్ రైతులు గురువారం రాత్రి నందిపేట్-నవీపేట్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. లారీలు సకాలంలో రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం బస్తాలు కల్లాల వద్దే ఉంటున్నాయని వాపోయారు.
మిగతా వడ్ల కుప్పలు సైతం తూకం జరగకుండా ఆటంకం కలుగుతుందని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లారీలను సకాలంలో పంపి ధాన్యం బస్తాలను రైస్మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.