కాంగ్రెసోళ్లకు ఎద్దు తెల్వదు.. ఎవుసం తెల్వదు.. ఏది వడితే అదే మాట్లాడుతుండ్రు. మూడు గంటల కరెంట్ ఇస్తారట. ఇప్పుడున్న మోటర్లను పీకి 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాల్నట. కాంగ్రెసోళ్ల తెలివి ఏడిసినట్లుందని రైతులు మండిపడుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన మూడుగంటల కరెంట్, 10 హెచ్పీ మోటర్ల వ్యాఖ్యలపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. ‘మునుపు కరెంట్ సక్కగ ఇయ్యకనే మమ్మల్ని ఆగం జేసిండ్రు. నోటికాడికొచ్చిన పంటల్ని ఎండవెట్టిండ్రు.. పొద్దుగాళ్ల, పొద్దిక్కి తోట్లనే జాగారం జేపిచ్చినోళ్లు కాంగ్రెసోళ్లు. తెల్లందాక బాయిల కాడనే పడిగాపులు కాసిన దినాలు యాదికత్తనే భయమైతది. ఇప్పుడు మళ్ల మూడు గంటల కరెంట్ అని మమ్ముల్ని ముంచనికే అత్తుండ్రు. ఉన్న మోటర్లు పీకేసి 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోమండ్రు.. కరెంట్ సక్కగా ఇత్తమని చెప్పే సోయిలేదు గానీ పనికి రాని మాటలు చెబుతుండ్రని’ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ను నమ్మేది లేదు.. కేసీఆర్ చేసిన మేలును మరిసేది లేదని కర్షకులు స్పష్టంగా చెబుతున్నారు. రైతులను నిండా ముంచిన కాంగ్రెస్కు ఓటేయబోమని, 24 గంటల ఉచిత కరెంట్ను పోగొట్టుకునేది లేదని పేర్కొంటున్నారు.
రేవంత్రెడ్డి మూడు గంటల కరంట్ అంటుండు. 10హెచ్పీ మోటర్లు అంటుండు.. అసలు ఎవుసం గురించి కాంగ్రెసోళ్లకు ఏమన్న ఎరుకేనా? ఎన్ని ఎస్పర్ల మోటర్ నడిస్తే ఎంత పొలం పారుతదో తెలుస్తదా? కాంగ్రెస్ హయాంల కరెంటు కోసం ఎంత గోసవడ్డం… గది మర్శిపోతమా..? ఎలచ్చన్లు రాంగనే మల్లా రేవంతం కథలు చెబుతుండు. మూడు గంటల కరంటు మస్తు అయితదని.. దస్ హెచ్పీ మోటర్ తోటి గంటకు ఎకరం పారుతదని అంటుండు. మరీ దస్ హెచ్పీ మోటర్లను ఎవ్వళ్లు కొనిస్తరు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే ఆగమైతం. కేసీఆర్ గవర్నమెంట్లో రంది లేకుండా ఎవుసం జేసుకుంటున్నం.
నిజామాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో మరెక్కడా అమలు కాని విధంగా రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలోనే అందుతున్నది. నిరంతరాయంగా సాగుకు అందిస్తున్న కరెంట్తో అన్నదాతలకు ఎనలేని ప్రయోజనం చేకూరుతున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో రాత్రి, పగలు తేడా లేకుండా రైతులంతా పొలాల్లోనే తిష్ట వేసుకుని కాపు కాసి కరెంట్ వచ్చినప్పుడు పొలాలకు నీళ్లు పట్టి వీలుంటే ఇంటికి వచ్చేది. చీకట్లో పాము కాట్లకు, తేలు కాట్లకు బలయ్యేది. చిమ్మ చీకట్లో విష పురుగుల మధ్య సావాసం చేసేది. కరెంట్ తీగలకే తగిలి ఉసురు తీసుకునే దుస్థితి గతంలో నిత్యకృ త్యం. కరెంట్ కోసం రోడ్డెక్కి రైతన్నలు ధర్నాలు, ఆందోళనలు చేసేది. ఇదంతా 2014కు పూ ర్వం రైతులకు ఎదురైన చేదు అనుభవాలు. కానిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. సాగుకు నిరంతరాయంగా విద్యుత్ను ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేకంగా గిమ్మిక్కు రాజకీయాలకు పాల్పడుతున్నది.
పీసీసీ చీఫ్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో 10 హెచ్పీ మోటర్లతో 3గంటల్లో 3 ఎకరాలకు సాగు నీటిని పారించుకోవచ్చంటూ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వాస్తవానికి ఈ 10హెచ్పీ సిద్ధాంతం అన్నది అమలుకు అసాధ్యమైన పని. 10హెచ్పీ మోటర్ల వాడకం వాడకం ద్వారా నీళ్లను భారీగా ఎత్తిపోయడం మూలంగా భూగర్భ జలం నిమిషాల్లోనే ఖతం కావడం ఖాయం. అంతేకాకుండా కరెంట్ వినియోగానికి ఆ స్థాయి సామర్థ్యానికి తగ్గట్లుగా మౌలిక సదుపాయాల కల్పన అన్నది గగనం. 10హెచ్పీ వాడకంలో మోటర్లు దెబ్బతింటే, మరమ్మతులు చేసుకోవడం కత్తిమీద సాములాంటిది. వాటికయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. 10హెచ్పీ మోటర్ కొనుగోలు కూడా రైతులకు ఎనలేని భారంతో కూడుకున్నది. ప్రస్తుతం రైతులు వాడుతున్న మోటర్ల కెపాసిటీ కేవలం 3హెచ్పీ లేదంటే 5హెచ్పీ వరకే గరిష్టంగా ఉంది.
రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన 10హెచ్పీ మోటార్ల వాడకంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరంతర విద్యుత్ సరఫరా అందుతున్నదని తద్వారా ఎలాంటి ఇబ్బందులు రైతులకు ఎదురు కావడం లేదని వా రంతా చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో నిరంతర విద్యుత్ అన్నదే కనిపించలేదు. ఉచిత విద్యుత్ హామీని సరిగ్గా నిలబెట్టుకోలేక గత కాంగ్రెస్ పాలకులు చతికిల పడిన సందర్భాలున్నాయన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ మరోమారు రైతులను మోసగించేందుకే 10హెచ్పీ మోటర్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ కర్షకుల కండ్లలో మట్టి కొట్టేందుకు సిద్ధమైందంటూ రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకనే కర్ణాటకలో 5గంటల కరెంట్ను అమలు చేస్తోందన్నారు. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనూ రైతులను మోసం చేసేందుకే ఇలాంటి కు టిల కుట్రలకు పాల్పడుతున్నదని కర్షకులంతా చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీతో కాల్చడానికి వెళ్లిన ఘ న చరిత్ర రేవంత్ రెడ్డిది. తెలంగాణ వచ్చాక, చంద్రబాబుతో కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం చేసిన కుట్రలోనూ రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలు కు వెళ్లిన సంగతి కూడా ప్రజల్లో ఉన్నదే. రైతుబంధు వృథా అంటూ వ్యాఖ్యనాలు చేసిన గొప్పతనం కూడా పీసీసీ చీఫ్కు దక్కుతుంది. రైతుకు 3గంటల కరెంట్ చాలంటూ పదే పదే వల్లిస్తున్నాడు. అవగాహనారాహిత్యం, అసమర్థత నేపథ్యంలో తగుదునమ్మా అం టూ కర్ణాటక నుంచి కాంగ్రెస్కు చెందిన 40 మంది ఎమ్మెల్యే లు, 10 మంది మంత్రులు, ఇంకొంత మంది ధనిక వర్గాలకు చెందిన నాయకత్వం ఏకమై తెలంగాణ రాజకీయాల్లోకి చొచ్చుకొచ్చి ప్రచారంలో మునిగి తేలుతున్నారు. వీళ్లంతా ఎలక్షన్ ప్రచారం పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న జుగుప్సాకరమైన రచ్చ కు తోడూ నీడగా నిలబడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచిని ఎదుర్కోలేక కుటిల నీతితో కుట్రలు చేస్తుండడంతో సర్వత్రా కాంగ్రెస్ నైజం బయటపడుతున్నది.
మోర్తాడ్, నవంబర్ 17 : మూడుగంటల కరంటిస్తే రాత్రి గంటన్నర, పగలు గంటన్నర ఇస్తరు. ఏ టైంల ఇస్తరో గుడా తెల్వది. తొమ్మిది గంటల కరంటిచ్చినప్పుడే పంటలు సక్కగ పండించుకోలేకపోయినం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినయి, ఇగ మూడుగంట కరంటిస్తే ఐదుగుంటలు సుక పండించలేం. 10హెచ్పీ మోటరు పెట్టుకునుడంటే ఉట్టిగనే అయితదా.. మస్తు పైసల్ గావాలె. ఒకవేళ మోటర్ పెట్టుకున్నా పైపులు అన్ని కొత్తయ్ ఏసుకోవాలె. తొమ్మిది గంటల కరంటు ఇచ్చినప్పుడే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినయ్. ఇగ 10హెచ్పీ వెట్టుకుంటే.. అన్ని కాలిపోతయ్. ఇప్పుడు ఉన్న 24 గంటల కరంటుతోటి రైతులు ఇష్టమచ్చినపుడు పొలాలకు నీళ్లను పారించుకుంటున్నరు. 10హెచ్పీ పెట్టుకుంటే మల్లా కరంటు కష్టాలు చాలైతయ్. భూమిలో ఉన్న నీళ్లు అయిపోతయ్, ఆఖరికి పంటలు ఎండిపోతయ్. రైతు నష్టాలపాలైతడు. మా నాయిన జీవన్ 2008లో పొలం వద్ద విద్యుత్షాక్తోటి సచ్చిపోయిండు. మళ్లీ కాంగ్రెస్ గర్నమెంట్ అస్తే మల్లా రైతులు సచ్చిపోవుడు మొదలైతది.
ఎల్లారెడ్డి, నవంబర్ 17 : వర్షాలు తక్కువ వడ్డా.. కరంటు గిట్లనే ఇస్తే ఏం తక్లీఫ్ గాదు. మూడు గంటల కరంటు అయితే ఎవుసం ముందట వడదు. ఎవుసానికి ఎంత తక్కువ అన్నా 15 గంటలు ఉండాలే. ఇప్పుడు వానకాలంలో 20 గంటల కరంటు అచ్చింది. పంటలు మంచిగ పండినయి. భూమిలో ఉన్న నీళ్లు వట్టి మోటరు పెట్టుకోవాలె. పది హస్పర్ మోటరు పెట్టుకుంటే ఉత్తదే. ఈడ ఇంచు, ఇంచున్నర, రెండు ఇంచుల నీళ్లే ఉంటాయి. దీనికి ఐదు హస్పర్ల మోటరు పెట్టుకుంటనే నడుస్తది. పది హస్పర్ల మోటర్లు పెట్టుకుంటే ఉన్న నీళ్లు గంటలనే అయిపోతయ్. అప్పుడు ఉన్న మోటరు కాలిపోతే మల్లా రూ.20 నుంచి రూ.30 వేలు ఖర్సు అయితయ్. యాడికెంచి పెట్టుకుంటం. వాగులు, కాలువలు, చెరవులల్ల ఆ మోటర్లు పనిచేస్తాయ్.. ఇక్కడ 5 హస్పర్ల మోటర్లు మస్తు. రేవంత్ అటున్నట్లు మూడు గంటల కరెంటు ఇస్తే మల్లా పొలాల కాడ జాగారం చేసుడైతది..
బాన్సువాడ, నవంబర్ 17 : కాంగ్రెస్ గవర్నమెంటు ఉన్నప్పుడు రాత్రి పూట కరంటు ఇచ్చుడుతోటి మా ఇంటాయన రాంగొండ ప్రాణాలు ఈడిసిండు. అప్పట్ల పొద్దున రెండు గంటలు, రాత్రి మూడు గంటలు కరంటు ఇస్తుండ్రి. లోవోల్టేజీతోటి మోటర్లు నడువక పోతుండె. నరకం ఉంటుండె. మా ఇంటాయన మోటర్ నడుస్తలేదని చూసేతందుకు పొలం కాడికి పోయిండు. ఫీజు ఏశెటప్పుడు షాక్ కొట్టి సచ్చిపోయిండు. అయినా కాంగ్రెసోళ్లు వోళ్లు మమ్ములను పట్టించుకోలె.. ఎవళ్లన్న అచ్చి ఎట్లున్నవు అవ్వ అని అడిగిన పాపాన పోలె. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇంతన్న సాయం అందించలె. గిప్పుడు సీఎం కేసీఆర్ అచ్చినంక మస్తు మంచిగున్నది. 24 గంటలు కరెంటు ఇచ్చుడుతోటి పొద్దుగల్ల పూటనే పొలాలకు నీళ్లు పెట్టి ఇంటికి అస్తున్నం.. మల్లా గిప్పడు రేవంతు వచ్చి మూడు గంటలు సాలు అంటున్నడు. మల్లా పాత రోజులు యాదికి చేసుకుంటేనే భయమైతున్నది. ఇంత మంచి సౌలత్ జేసిన కేసీఆర్ సారే మల్లా రావాలె.
డోంగ్లీ,నవంబర్ 17 : తెలంగాణ గవర్నమెంటు 24 గంటల ఉచితంగా కరెంటు ఇస్తున్నప్పటి సంది మొత్తం పొలం పడుతున్నది. ఒక్క గుంట కూడా బీడుగా ఉండడం లేదు. గతంల విడుతల వారీగా కరెంటు ఇచ్చుడుతోటి మస్తు తిప్పలు వడ్డం.. రాత్రి, పగలు లేకుండా పొలాల పొంటి తిరుగుతుంటిమి. ఇంటికి అస్తమన్న గ్యారంటీ ఉండకుండే. పాణం అరచతిలో పట్టుకొని ఇండ్లకు అస్తుంటిమి. కేసీఆర్ గర్నమెంట్ అచ్చినంక పొద్దున్నే బాయి కాడికి పోయి పొలాలకు నీరు పారిచ్చి సాయంత్రం బందు చేసి అస్తున్నాం. సాయంత్రం గూడా అవసరమైతే స్ప్రింక్లర్లు పెట్టేస్తున్నాం. పక్కనే మహారాష్ట్ర ఉంది.. అక్కడా ఇప్పటికి ఎనిమిది గంటల కరెంటే ఉంది. మోటర్ పంపు హెచ్పీల వారీగా బిల్లులు చెల్లిస్తారు. మూడు గంటల కరెంటుతోటి మళ్లీ ఆగమైతది.
భీమ్గల్, నవంబర్ 17 : రేవంత్ రెడ్డికి ఎన్ని ఎస్పర్ల మోటర్లు వెట్టుడో ఏం తెలుసు. గిప్పుడు ఐదు ఎస్పర్ల మోటర్లు మస్తు అయితయ్. రేవంత్ రెడ్డి అన్నట్లు పది ఎస్పర్ల మోట ర్లు వెడితే కరెంట్ ఓవర్ లోడ్తో ట్రాన్స్ఫార్మర్ల సంగతి ఏంది. మళ్లీ పాత రోజులే అస్తయ్. పది ఎస్పర్ల మోటర్లకు పైసల్ డబుల్ అయితాయి. రూ.30 వేల నుంచి 40 వేల ఖర్సు ఎక్కువైతది. దీంతోటి చిన్న, సన్నకారు రైతులకు మస్తు భారం అయి తది. పది ఎస్పర్ల మోటర్లు వెడితే బోరుబావుల్లో నీళ్లు ఎ్కడ నుంచి అస్తయ్. నాలుగేండ్ల సంది వర్షాలు పడుతున్నాయి నీళ్లకు ఢోకా లేదు. 24 గంటలు కరెంటు ఇచ్చుడుతోటి రైతులకు మస్తు సౌలత్ అయింది. పది ఎస్పర్ల మోటర్లు పెడితే బోరు బావులల్ల నీళ్లు లేక మోటర్లు కాలిపోయి రైతుకు భారం అయితది. పది ఎస్పర్ల మోటర్లతో 3 గంటల్లో పొలాలను తడుపు ఉట్టి ముచ్చటనే.. ఈ మాటలతోటి కాంగ్రెసోళ్లు రైతులను అయోమయం చేస్తుండ్రు.
కోటగిరి నవంబర్ 17: కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కరెంట్ బాధలు మస్తు ఉంటుండె. పొలాలకు నీళ్లు వెట్టేందుకు రాత్రి పూట పోయేటోళ్లం. శాన తిప్పలు అయ్యేది. అప్పుడైతే కరెంట్ సక్కగా ఉండకుండే. కరెంట్ లోడ్ ఎక్కువై వారంల మూడు సార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండె. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి పాత పొతంగల్ హనుమన్ మందిరం మీద వారం వారం ఉంచుతుంటిమి. శాన తిప్పలు అయితుండె. కరెంట్ లోడ్ తిప్పలు ఉండేవి. కాంగ్రెస్ గవర్నమెంటోళ్లు కరెంటు గురించి పట్టించుకోలె. డోంగ్లీ కాడా ఒక్కటే సబ్ స్టేషన్ ఉంటుండె. సీఎం కేసీఆర్ సర్కార్ అచ్చినంక రైతులకు కష్టాలు దూరం అయినయ్. స్పీకర్ పోచారం సారూ పుణ్యమా అని సిర్పూర్ దగ్గర సబ్స్టేషన్ కొత్తగా అయింది. అప్పటి సంది కరెంట్ తిప్పలు లేవు. కరెంట్ కూడా 24 గంటలు ఫుల్ ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కరెంట్ తిప్పలు శాన ఉండె.. పంటలకు నీళ్లు పెట్టేందుకు పొలాల కాడ జాగారం చేస్తుంటిమి. గిప్పుడైతే మస్తు సౌలత్ అయ్యింది.