దగాకోరు కాంగ్రెస్ అన్నదాత నడ్డివిరిచే కుయుక్తులు పన్నుతున్నది. రైతుల నోటికాడి కూడును లాగేస్తున్నది. అధికారంలోకి రాకముందే రైతులను శత్రువులుగా చూస్తున్న కాంగ్రెసోళ్లు.. ఇగ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడుతున్నారు కర్షకులు. పదవుల కోసం వ్యవసాయమే లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతు క్షేమంగా ఉంటే.. కాంగ్రెసోళ్లు రైతులకు నిద్రలేకుండా చేయాలని చూస్తున్నారు. మెరుగైన వ్యవస్థలను రూపుమాపి అన్నదాతలను ఆగమాగం చేయాలని చూస్తున్నది. ధరణిని తొలగించి దళారుల రాజ్యం తెచ్చి, రైతుల మధ్య భూ పంచాయితీలు, గొడవలకు ఉసిగొల్పాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. కరెంటును బంద్ చేసి పచ్చని పంట భూములను బీడుగా మార్చి, వ్యవసాయమే లేకుండా చేయాలని చూస్తోందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా యాసంగి పంటకు పెట్టుబడి అందించేందుకు ప్రభుత్వం ఈసీ అనుమతి తీసుకోగా.. దానిని కూడా రైతులకు అందకుండా కాంగ్రెసోళ్లు అడ్డుకోవడంపై కర్షకులు మండిపడుతున్నారు. అధికారంలోకి రాకముందే రైతులను పట్టిపీడిస్తున్న కాంగ్రెసోళ్లకు.. అధికారం ఇస్తే మన గొయ్యి మనమే తవ్వుకునేటట్లు చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే రిస్క్ తీసుకోమని, రైతు సంక్షేమ సర్కారు అయిన కేసీఆర్నే గెలిపిస్తామని స్పష్టం చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తదో అని బిక్కుబిక్కుమని చూసేవాళ్లం. ఎకరం పొలం పారడానికి పొద్దంతా ఎదురుచూస్తూ ఉండేవాళ్లం. పొలంకాడ రాత్రి కావలి ఉండి పొలం పారిచ్చుకునేది. ఎవుసం జేయాలంటే పాణాలు పణంగా పెట్టాల్సి అచ్చేది. నానా గోసలు పడ్డం. తెలంగాణ సర్కారు వచ్చినంక సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లను తీసుకొచ్చిండు. ఇగ కరెంటయితే 24గంటలు ఉంటున్నది. మళ్లీ కాంగ్రెసోళ్లు 3గంటల కరెంట్ సాలు, 10హెచ్పీ మోటరు పెట్టాలని అంటున్నరు. మూడు గంటల కరెంట్ ఎకరం గూడా వారది. 10 హెచ్పీ మోటర్లు కొనాలంటే రైతులు అప్పులు జేయాల్సి అత్తది. ఆ కాంగ్రెస్ మాకొద్దు. కేసీఆర్ సారే మళ్లీ సీఎం కావాలె.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నట్లు మూడు గంటల కరెంట్తో రైతులకు మళ్లీ పాత రోజులే వస్తాయి. రాత్రుల్లో పొలాల వద్దకు పోవడం మొదలవుతుంది. 10హెచ్పీ మోటర్లతో ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడి కాలిపోయి వాటి రిపేర్ల కోసం డబ్బులు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ రేవంత్రెడ్డికి ఏం తెలుసు. మమ్మల్ని ఆగం చేయడం తప్ప. అందుకే 24గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్కే మా మద్దతు.
10 హెచ్పీ మోటరు రైతులు పెట్టాలంటే ఎంతో ఖర్చయితది. ఆ ఖర్చులు మా రైతులతో కాదు. మరి ఎవరు భరించాలి. రైతులను కాంగ్రెస్ అయోమయంలో పడేస్తున్నది. 10 హెచ్పీ మోటరుకు ఇప్పుడు ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పనిచేయవు. అంత పెద్ద మోటరు రైతులకు అవసరమా? రైతులను ముంచడానికే కాంగ్రెస్ నాయకులు తలో మాట మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న కరెంట్ బాగానే ఉన్నది. 24 గంటలు ఉచితంగా ఇస్తున్నరు. రైతులందరం సంతోషంగా ఉన్నాం.
రైతులు బాగుపడడం కాంగ్రెస్ ఇష్టముండదు. 3గంటల కరెంట్తో రైతులకు ఏం లాభం లేదు. కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు 3గంటల కరెంట్, 10 హెచ్పీ మోటర్లతో లాభం ఉండదు. రైతులంతా ఒకేసారి మోటర్లు చాలు చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతాయి. సమీపంలోని సబ్స్టేషన్లపైన భారం పడి ఇండ్లలో కరెంట్కు ముప్పు వస్తుంది. రైతుల గోస మళ్లీ మొదలవుతుంది. ఇప్పుడు తెలంగాణ సర్కారు 24గంటల కరెంట్ ఇస్తున్నది. పంటలు మంచిగా పండుతున్నయి. 10 హెచ్పీ మోటరు పెడితే భూగర్భజలాలు కిందకి పడిపోతాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో రైతులమంతా సంతోషంగా ఉన్నాం. కాంగ్రెసోళ్లకు ఓటేస్తే మా బతుకులు మళ్లీ ఆగం చేస్తరు.
24గంటల కరంటు సేసుట్ల ఇంట్ల అందరికీ కంటినిండ నిద్ర ఉన్నది. మళ్ల మూడుగంటలని మానిద్రల్ని, మాపంటలను పాడుజేయకుండ్రి. కావాల్సినంత కరంటు, కడుపునిండా నీళ్లు ఉన్నయి గొప్పలు జెప్తున్నం. మంచిగున్నదాంట్ల మన్నువోయకుండ్రి. మాఊర్ల సబ్స్టేషన్ అయిన్నుంచి కరంటు బాధలే లేవు. ఇప్పుడు మూడే గంటలిస్తం. మస్తయితది అని ఆగమాగం మాట్లాడి, మమ్మల్ని ఆగంజేయకుండ్రి. ఉన్నది ఉన్నట్లుగా ఉంటే మీ పంటలేమన్న ఎండిపోతయా. మామీద మీకు కన్నెందుకు ఇప్పుడు కరంటు ఎట్ల ఉన్నదో గట్లనే ఉంచుండ్రి. లేకుంటే మళ్ల పంటలు ఎండిపోవుడు, పొలాలకాడ పండుడైతది.
కాంగ్రెసోళ్లు పాలించినప్పుడు కరెంటు కోతలు తప్పా మాకు కరెంట్ వచ్చింది లేదు. ఆరు గంటల కరెంటని మూడు గంటలు కూడా ఇవ్వలేదు. నడిరాత్రి కరెంట అత్తె అప్పుడు మస్కట్ లైట్లు పట్టుకొని పొలాలకాడికి ఉరికేటోళ్లం. కరెంటు సరిగా రాక చేతికచ్చిన పంటలు ఎండిపోయిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. కానీ సీఎం కేసీఆర్ అచ్చినంక 24గంటల కరెంట్తో మా బాధలు తీరాయి.అందుకే మేము కేసీఆర్ తోనే ఉంటాం.
రేవంత్రెడ్డి వ్యవసాయం, మోటర్లపై అవగాహన లేకుండా మాట్లాడుతుండు. గత కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. అప్పుడు ఎకరం పొలం తడవాలంటే నానా ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24గంటల కరెంట్తో 5హెచ్పీ మోటర్లతో పొలానికి నీళ్లు పారిస్తున్నాం. అలాంటిది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి 10హెచ్పీ మోటర్లతో గంటలో ఎకరం పొలం పారించవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. అసలు ఆయనకేం తెలుసు. అవగాహన లేని మాటలతో రైతులను ఆగం చేయాలని చూస్తున్నరు.
గతంలో మాదిరి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోవడం లేదు. తాము అధికారంలోకి వస్తే 3గంటల కరెంట్ ఇస్తామని కాంగ్రెసోళ్లు చెప్పడం సరికాదు. రైతులందరూ 10హెచ్పీ మోటర్లు పెట్టి ఒక్కసారి చాలు చేస్తే ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా మిగలదు. ఆ డబ్బులు రైతులు ఎక్కడ నుంచి తెస్తారు. అన్నీ కాలిపోతాయి. కాంగ్రెస్ నాయకుల మాటలు వింటుంటే రైతులను ఆగం చేసేలా ఉన్నది. రైతులకు కిరికిరిపెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
రేవంత్రెడ్డి అన్నట్లు 3గంటల కరెంట్ వ్యవసాయానికి సరిపోదు. ఈ విషయం ఆయనకు తెలియదు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24గంటల ఉచిత విద్యుత్తో నాణ్యమైన పంటలు పండించుకుంటున్నాం. కాంగ్రెసోళ్ల మాటలతో మళ్లీ తిరిగి పాత రోజులే వస్తాయంటేనే భయం వేస్తున్నది. అప్పట్ల రాత్రిపూట కరెంట్తో పొలాలకు పరుగులు పెట్టేవాళం. ఇప్పుడు నాటి కష్టాలు లేవు.
రైతులెవరూ 10హెచ్పీ మోటరును ఎవుసానికి వాడరు. రేవంత్రెడ్డి అడ్డదారిన అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలను గుప్పిస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా 24గంటల కరెంట్ సరఫరా చేస్తున్నది. విద్యుత్ బిల్లు బాధ కూడా రైతులకు లేదు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాం.
10హెచ్పీ మోటర్లకు అయ్యే ఖర్చును భరించలేం. ఒక్కో మోటరుకు సుమారు 50 నుంచి 60వేల ఖర్చు అవుతుంది. ఎన్ని హెచ్పీల మోటర్లు పెట్టినా సరైన కరెంట్ లేకపోతే ఉత్తదే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24గంటల కరెంట్తో మా బాధలు తీరాయి. రాత్రుళ్లు పొలం వద్దకు పోయే తిప్పల నుంచి విముక్తి లభించింది. మేమందరం బీఆర్ఎస్ వెంటే ఉంటాం.
కాంగ్రెసోళ్లు చెబుతున్నట్లు మూడు గంటల కరెంట్ ఇస్తే మళ్లీ మేము రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. 3గంటల కరెంట్ సరఫరాతో కనీసం ఎకరం పొలం సైతం తడిచే పరిస్థితి ఉండదు. 10 హెచ్పీ మోటరు పెడితే భూగర్భజలాలు అడుగంటిపోతాయి. ఈ మోటరు కొనాలన్నా రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. అంత డబ్బు ఎలా కడతాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తుంది. 24 గంటల కరెంట్తో పంటలు మంచిగ పండుతున్నాయి.