ఖలీల్వాడి/కామారెడ్డి, మే 2 : ప్రజలకు దృష్టి సమస్యలను పూర్తిగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను ఉచితంగా అందజేస్తున్నారు. నిజామబాద్ జిల్లాలో సమస్యలు లేకుండా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. మంగళవారం 7988 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 360 మందికి కండ్లద్దాలను అందజేశామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,23,183 మందికి కంటి పరీక్షలు చేసి 84,508 మందికి అద్దాలు అందజేశామని వివరించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 44 బృందాలతో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్ తెలిపారు. తాజాగా 5,023 మందికి పరీక్షలు నిర్వహించి 519 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3,62,546 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 53,127 మందికి కళ్లద్దాలు అందజేసినట్లు చెప్పారు.
నేను కొన్ని రోజుల నుంచి కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకున్నా. అద్దాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కండ్లు మంచిగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ దవాఖానలో చూపిస్తే చాలా ఖర్చు అయ్యేది.
– ముదాం లక్ష్మీనారాయణ, కామారెడ్డి
కంటి వెలుగు కార్యక్రమంతో నా కండ్లల్లో వెలుగు వచ్చింది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లి చూయించుకోవాల్సిన అవసరం లేకుండా మా కాలనీలోనే సీఎం కేసీఆర్ పరీక్షలు చేయిస్తున్నడు. ఎలాంటి ఖర్చు లేకుండా కండ్లద్దాలు ఇచ్చిండు. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా.
– సురేఖ, కామారెడ్డి