నిజామాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఉమ్మడి జిల్లాలో నీచ రాజకీయ క్రీడకు తెర లేపారు కొందరు ఉన్నతాధికారులు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థే సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చారు. అధికారంలో ఎవరున్నా కార్యనిర్వాహక వ్యవస్థలో పని చేసే వారంతా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రజల సంక్షేమమే ఎజెండాగా పని చేయాలి. కానీ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అందుకు భిన్నంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచిందో లేదో కొంత మంది ఉన్నతాధికారుల వ్యవహార శైలిలో పెను మార్పు వచ్చింది. నేరుగా బెదిరింపులకు దిగే పరిస్థితి తలెత్తింది. అది కూడా రాజకీయంగా ఒత్తిళ్లకు పాల్పడుతుండడం విస్తుగొల్పుతున్నది. నిజామాబాద్ జిల్లాలో క్రియాశీలకమైన బాధ్యతలు నిర్వహించే ఓ ఉన్నతాధికారి బెదిరింపులు ఇప్పుడు రాజకీయ వర్గా ల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) చైర్మన్లకు నేరుగా ఫోన్ చేస్తూ తప్పుకోవాలని బెదిరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి పీఏసీఎస్ చైర్మన్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. రైతులే సభ్యులుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి సం ఘాల్లో పాలకవర్గాలకు ఇటీవల అధికారుల వేధింపు లు ఎక్కువయ్యాయి. రైస్ మిల్లులు, ఇతరత్రా వ్యాపారాలు ఉన్నటువంటి అధ్యక్షులనే టార్గెట్గా పెట్టుకుని ఓ ఉన్నతాధికారి బెదిరింపులకు పాల్పడుతుండడం గమనార్హం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులుగా నిర్వర్తించాల్సిన బాధ్యతలను వదిలి రాజకీయ పార్టీ నేతలు చెప్పే ఆదేశాలను పాటిస్తూ అధికార పార్టీకి తొత్తుగా, కార్యకర్తలుగా వ్యవహరించడం సరికాదని బాధితులు వాపోతున్నారు.
రైస్మిల్లు వ్యాపారంలో ఉన్న విండో చైర్మన్లకు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. సీఎంఆర్ వంకను బూచీగా చూపి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలిసింది. లేదంటే తనిఖీల పేరుతో పౌరసరఫరాల శాఖ అధికారులను పంపించి ఇక్కట్లు సృష్టించడం పరిపాటిగా మారింది. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో ఈ తరహా బెదిరింపులు రాజ్యమేలుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ఫలానా వాళ్లు చెప్పారండి.. గమ్మున రాజీనామా చేసేయండి’ అంటూ వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ‘మేము ఏం చేస్తాం. తప్పడం లేదు.. అర్థం చేసుకోండి. మా వాళ్లు వస్తే మళ్లీ ఇబ్బందులు వస్తాయ్… రేపటి కల్లా రాజీనామా చేసి విధులకు దూరంగా ఉండండి’ అంటూ ఫోన్లలో బెదిరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మార్కెట్ కమిటీ చైర్మన్గా పని చేసిన ఓ నాయకుడు, మరో కాంగ్రెస్ నాయకుడితో కలిసి ఇదే పనిగా బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కించుకోలేక చతికిల పడిన సదరు నాయకుడు తన ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను కాదని వ్యవహారాలు నడుపుతుండడంపై కాంగ్రెస్ పార్టీలోనూ చర్చ జరుగుతున్నది. ఈ నియోజకవర్గంలో 22 పీఏసీఎస్లు ఉండ గా, ఇప్పటికే పలువురిని బలవంతంగా రాజీనామా చేయించారు. ఇప్పుడు మరికొంత మంది వెంట పడుతూ వేధిస్తున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ నేతలైతే అధికార బల ప్రయోగానికి పాల్పడుతూ ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు. బాన్సువాడలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నాయకుడి తీరు కూడా ఇలాగే ఉంది. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని బెదిరిస్తూ స్థానిక ఎమ్మెల్యేకు సహకరించకూడదంటూ హుకూం జారీ చేస్తుండడం చర్చనీయాంశమైంది. ఇప్పుడేమో పీఏసీఎస్ పాలకవర్గాలపై జరుగుతున్న అధికార బల ప్రయోగం హస్తం పార్టీ నేతల అధికార దాహాన్ని చాటి చెబుతున్నది. బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా ఇదే తరహా బెదిరింపు రాజకీయాలతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల కన్నా కూడా ఓడిపోయిన నేతలే అధికారాన్ని చెలాయించాలని చూస్తుండడం, వారికి ఉన్నతాధికారులు సైతం వంత పాడుతుండడం విస్మయం కలిగిస్తున్నది.