నిజాంసాగర్/మద్నూర్, సెప్టెంబర్ 2: వర్షం కురిసి వాగు ఉధృతంగా ప్రవహిస్తే చాలు గ్రామాలు, వ్యవసాయ పొలాలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రయాణికులు, రైతులు వాగులో నీరు ప్రవహించడంతో లో లెవెల్ వంతెన పైనుంచి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. సమైక్య పాలనలో వంతెన నిర్మాణం చేపట్టాలని పాలకులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రహదారులు, వంతెనలకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నది. ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా చూస్తున్నది. అందులో భాగంగా మద్నూర్ మండలం అంతాపూర్, జుక్కల్ మండలం సోమూర్ గ్రామాల మధ్యలో ఉన్న లోలెవల్ వంతెన స్థానంలో హై లెవల్ వంతెన నిర్మాణం కోసం రూ.3.50 కోట్ల నిధులను మంజూరు చేసింది.
ఈ మేరకు శుక్రవారం జీవోను విడుదల చేసింది. దీంతో మద్నూర్, జుక్కల్ మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సమైక్య పాలనలో జుక్కల్ నియోజకవర్గంలో సుమారు వంద గ్రామాలకు రహదారులు కూడా సరిగా లేకపోవడంతో రవాణా వ్యవస్థ అంతమాత్రంగానే ఉండేది. అంతేకాకుండా వంతెనలు లేకపోవడం, లో లెవెల్ వంతెనలు ఉండడంతో వానకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారు. స్వరాష్ట్రం సాధించుకున్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే హయాంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేశారు. ప్రస్తుతం రహదారి లేని గ్రామం లేకుండా పోయింది. రాష్ట్రం ఏర్పాటు అనంతరం సుమారు వంద గ్రామాలకు బీటీ రోడ్లు వేశారు. ప్రతి మండలంలో అవసరం ఉన్న ప్రదేశాల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి వంతెనలను నిర్మించారు.
విరివిగా వంతెనల నిర్మాణం..
బిచ్కుంద మండలంలోని దేవాడ, పిట్లం మండలంలోని కుర్తి, నిజాంసాగర్ మండల కేంద్రంలోని మంజీర, రాంపూర్లో వంతెన సరిగా లేక ప్రయాణికులు, ఆయా గ్రామాల ప్రజలు వానకాలంలో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం ఈ వంతెనలన్నీ నిర్మించారు. ఎంత పెద్ద వరద వచ్చినా.. ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు కొనసాగుతున్నాయి. అంతాపూర్-సోమూర్ గ్రామాల మధ్య గల వంతెన శిథిలావస్థకు చేరుకోవడం, లో లెవల్ వంతెన ఉండడంతో వానకాలంలో మద్నూర్ నుంచి జుక్కల్కు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రస్తుతం రూ.3.50కోట్లు నిధులు మంజూరుకావడంతో రెండు గ్రామాల ప్రజలే కాకుండా రెండు మండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు తొలిగిపోతాయి..
అంతాపూర్-సోమూర్ గ్రామాల మధ్యలో లో లెవల్ వంతెన ఉండడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వానకాలంలో వరద ప్రవహిస్తే చాలు రాకపోకలు నిలిచిపోయేవి. ఎమ్మెల్యే హన్మంత్షిండే చొవరతో నిధులు మంజూరయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలిగిపోతాయి.
– గంగాధర్, అంతాపూర్
ప్రత్యేక రాష్ట్రంతోనే సాధ్యమవుతున్నది..
ప్రత్యేక రాష్ట్ర సాధనతోనే నియోజకవర్గంలో రహదారులు, వంతెనల సమస్యలు లేకుండా పోతున్నాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చాలా గ్రామాలకు రహదారులు, వంతెనలు సరిగా లేక రవాణా వ్యవస్థ స్తంభించింది. అంతాపూర్-సోమూర్ వంతెనకు నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– సుధాకర్, లొంగన్
ప్రతి గ్రామానికీ రహదారి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జుక్కల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రహదారి ఏర్పాటైంది. పక్కనే కర్ణాటక, మహారాష్ట్ర గ్రామాల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మా మండలంలో రహదారులన్నీ అందంగా తయారయ్యాయి. తాజాగా మా గ్రామంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం సంతోషంగా ఉంది. ఇక వానకాలంలో ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందుల ఉండవు.
– రాజు, అంతాపూర్