కామారెడ్డి/ఇందల్వాయి/కంఠేశ్వర్, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం ఆయన పర్యటించారు. కామారెడ్డి మండలం ఉగ్రవాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్.. రైతులకు కల్పించిన వసతులు, రిజిస్టర్లు, తూకాలు, నూతనంగా ప్రవేశపెట్టిన ఐరిస్ విధానం, ట్యాబ్ ఎంట్రీ వివరాలను తెలుసుకున్నారు. తాలు, మట్టి లేకుండా తేమశాతం 17 ఉండేలా చూసుకొని ధాన్యాన్ని కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు. హార్వెస్టర్ యజమానులు పొలం కోయడానికి గంటకు ఎంత వసూలు చేస్తున్నారని రైతులను అడగగా రూ.1800 తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం రాఘవేంద్ర రైస్మిల్లును సందర్శించి రోజువారీ లక్ష్యాల మేరకు మిల్లింగ్ పూర్తి చేయాలని యజమానులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున బాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా ఇన్చార్జి మేనేజర్ నిత్యానంద్ ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటికే 2.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ధాన్యం విక్రయించిన రైతులకు బిల్లుల చెల్లింపులు వేగంగా చేపడుతున్నామని కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి నిజామాబాద్ జిల్లాలోని రైస్మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. అంతకుముందు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులు, రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. అనంతరం గుండారం గ్రామంలోని జై గణేశ్ ప్యాడీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ (రైస్మిల్)ను తనిఖీ చేశారు. ఇందల్వాయి మండలం గన్నారం, చంద్రాయన్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులు తీసుకొచ్చిన ధాన్యం తేమశాతాన్ని కొలిచారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్వో చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్ పాల్గొన్నారు.