నిజామాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తన నామినేషన్ దాఖలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. నవంబర్ 9న కామారెడ్డి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో స్వయంగా కేసీఆరే నామినేషన్ సమర్పించనున్నారు. ఉదయం గజ్వేల్లో నామినేషన్ వేసిన తర్వాత మధ్యాహ్నం కామారెడ్డిలో దాఖలు చేస్తారు. ఇందులో భాగంగా తనకు అత్యంత సెంటిమెంట్గా భావించే సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కోనాయిపల్లిలోని ప్రసిద్ధ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఏదైనా పనిని తలపెట్టేందుకు, ఎన్నికల్లో పోటీకి నామినేషన్ పత్రాలకు ముందు కేసీఆర్ ఇక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించడం మూడున్నర దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నది. అదే సంప్రదాయాన్ని కేసీఆర్ ఈసారి కూడా పాటించారు. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ ముఖ్యులతో కలిసి వేంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లి స్వామి వారి పాదాల చెంత గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ పత్రాలను కేసీఆర్ సమర్పించారు. దేవాలయ ప్రాంగణంలోనే వేద ఆశీర్వచనాలు పొందడంతో పాటు నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
1989 నుంచి సెంటిమెంట్
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయం చారిత్రక నేపథ్యం గలది. ఇక్కడి దేవాలయం ముఖ ద్వారం దక్షిణం వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు దేవాలయాలు నెలకొనడం చాలా అరుదు. అది కూడా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకతగా ఈ ప్రాంతానికి నిలిచింది. కేసీఆర్ ఏ పని తలపెట్టినా, శుభకార్యం చేసినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే పనులను ప్రారంభిస్తారు. ప్రతి ఎన్నికల ముందు నామినేషన్ పత్రాలను వేంకటేశ్వర స్వామి చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేయడం దశాబ్దాలుగా కేసీఆర్కు సెంటిమెంట్గా వస్తున్నది. 1989లో తొలిసారి కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను స్వామి వారి చెంత పెట్టి పూజలు నిర్వహించారు. అనంతరం వరుసగా ప్రతి ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు.
నవంబర్ 9న బహిరంగ సభ
కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈ నెల 9న కామారెడ్డికి రానున్నారు. గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ అధినేత ప్రకటన వెలువరించిన అనంతరం కేసీఆర్ తొలి సారి ఈ ప్రాంతానికి వస్తున్నారు. అక్టోబర్ 30న జుక్కల్, బాన్సువాడలో ప్రజా ఆశీర్వాద సభలకు కామారెడ్డి జిల్లాకు వచ్చినప్పటికీ కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం తొలిసారి అడుగు పెడుతున్నారు. కామారెడ్డిలో నామినేషన్ సమర్పించిన తర్వాత కేసీఆర్ ఇక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. ప్రజా ఆశీర్వాద సభ ద్వారా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సందేశాన్ని కేసీఆర్ ఇవ్వబోతున్నారు. సీఎం కేసీఆరే స్వయంగా ఈ ప్రాంత అభివృద్ధిపై తనకున్న ప్రణాళికలను వివరించే అవకాశం ఉంది. గతానికి ఇప్పటికీ కామారెడ్డి ప్రాంతం భారీగా అభివృద్ధి చెందింది. ఎవ్వరూ ఊహించని విధంగా దూసుకుపోతున్న కామారెడ్డికి కేసీఆర్ రాకతో మరిన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు తప్పకుండా నెరవేరనున్నాయి. కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నారన్న సమాచారంతో ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని మొత్తం 8 మండలాల ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్వచ్ఛందంగా కేసీఆర్కు మద్దతు తెలియజేసి కేసీఆర్కు అండగా నిలిచి భారీ మెజార్టీ అందించేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.