బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. మొదట జుక్కల్ చౌరస్తాలో జాతీయ రహదారికి ఆనుకున్న ఉన్న ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని అటు నుంచి బాన్సువాడ పట్టణంలోని వీక్లి మార్కెట్ మైదానంలో నిర్వహించే సభకు హాజరుకానున్నారు. ఇప్పటికే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సీఎం రాక సందర్భంగా పటిష్ట ఏర్పాట్లను చేశారు. భారీగా తరలి వచ్చే జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తమ అభిమాన నేతను చూసేందుకు ప్రజలు సైతం స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కల్, బాన్సువాడ సభలతోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా.. కామారెడ్డి నుంచి గులాబీ బాస్ పోటీ చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
నిజామాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర తొలి ఎన్నికల పర్యటనకు సర్వం సిద్ధమైంది. నేడు(సోమవారం) జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి జుక్కల్కు హెలికాప్టర్లో వస్తారు. అక్కడ ఎన్నికల ప్రచార సభకు హాజరై బాన్సువాడకు పయనం అవుతారు. ఇక్కడ్నుంచి నారాయణ్ఖేడ్ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. వరుసగా ఒకే రోజు మూడు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననుండగా.. ఇందులో రెండు సభలు కామారెడ్డి జిల్లాకు సంబంధించినవే ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ బహిరంగ సభలను స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రచార సభను వీక్లి మార్కెట్ మైదానంలో నిర్వహించనున్నారు. భారీ జనసమీకరణపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడంతోపాటు రికార్డు స్థాయిలో భారీ మెజా ర్టీ గెలుపే లక్ష్యంగా పోచారం కృషి చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గ సభను జుక్కల్ చౌరస్తాలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలంలో నిర్వహించనుండగా.. స్థానిక ఎమ్మెల్యే షిండే ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలంగాణ కోసం పోచారం, షిండే పదవులను త్యాగం చేసి బీఆర్ఎస్లో చేరారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంట నడిచేందుకు కదిలి వచ్చారు. బాన్సువాడలో జరిగిన ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన పోచారం భారీ మెజార్టీతో గెలుపొందారు. కేసీఆర్ పోరాట ఫలితంతో స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బాన్సువాడ నుంచి పోచారం, జుక్కల్ నుంచి షిండే బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కేసీఆర్ను మెచ్చిన ప్రజలంతా కారు గుర్తుకే ఓటేసి వీరిని అసెంబ్లీకి పంపించారు. బంగారు తెలంగాణ లక్ష్యంతో పని చేసిన కేసీఆర్ పరిపాలనను మెచ్చి 2018 అసెంబ్లీ పోరులో మరోసారి బాన్సువాడ, జుక్కల్లో ఇరువురు నేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించా రు. ఇప్పు డు ముచ్చటగా మూడోసారి పోచారం, హన్మంత్ షిండే రికార్డు సృష్టించబోతున్నారు.
లక్ష మందితో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు రెండు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. బాన్సువాడలో ప్రజా ఆశీర్వాద సభను రికార్డు స్థాయిలో జన సమీకరణతో నిర్వహించేందుకు పోచారం ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ చౌరస్తా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. జాతీయ రహదారికి ఆనుకుని సభా ఏర్పాట్లు చేయ డం ద్వారా రాకపోకలకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తే పరిస్థితి లేదు. మరోవైపు మధ్యాహ్నం నిర్వహించే ఈ బహిరంగ సభలకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి వచ్చే వీలుంది. సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో పెద్దసంఖ్య లో జనాలు వచ్చే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలను తీసుకుంటున్నది. మహారాష్ట్ర సరిహద్దులో ఈ ప్రాంత ప్రజలంతా పక్క రాష్ర్టాల్లోని ప్రజల వెతలను కళ్లారా చూస్తున్నారు. వీరంతా కేసీఆర్ చేస్తున్న మంచిని గ్రహించి గులాబీ పార్టీకే వచ్చే ఎన్నికల్లో జై కొట్టనున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కల్, బాన్సువాడ సభలతోనే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈసారి గతానికి భిన్నంనగా కామారెడ్డి నుంచి సైతం పోటీ చేస్తున్న గులాబీ బాస్ తొలి సారి కామారెడ్డి జిల్లాలో అడుగు పెట్టబోతుండడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆరే స్వయంగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండడంతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. తొలి విడుత ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ మేరకు అక్టోబర్ 30న జుక్కల్, బాన్సువాడ సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. నవంబర్ 2న బాల్కొండ, నవంబర్ 3న ఆర్మూర్ బహిరంగ సభలకు కేసీఆర్ రానున్నారు. నవంబర్ 9న కామారెడ్డి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. నవంబర్ 9తో ఉమ్మడి జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలను పూర్తి చేసుకోబోతున్న గులాబీ బాస్… మలి విడుత షెడ్యూల్లో మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో కేసీఆర్ స్వయంగా పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.