నిజామాబాద్ రూరల్, జనవరి 8 : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు రూరల్ మండలంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ జోరుగా కొనసాగి ఆదివారం ముగిసింది. ముగింపు రోజున కొత్తపేట, గాంధీనగర్ తండా గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ నిజామాబాద్ రూరల్ మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి పార్టీని మరింత పటిష్టపర్చాలని ఆదేశించారు.
ఈ మేరకు రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మీసాల మధుకర్రావు, ఎంపీపీ అనూషా ప్రేమ్దాస్నాయక్, జడ్పీటీసీ బొల్లెంక సుమలతా గోపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ అన్నం సాయిలు, ఎంపీటీసీ, బీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి అంకల గంగాధర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అశోక్, గుండారం, ముత్తకుంట సొసైటీ చైర్మన్లు దాసరి శ్రీధర్, పైసా స్వామి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్నాయక్, మైనార్టీ మండల అధ్యక్షుడు జమీర్ఖాన్, నాయకులు రాంగోపాల్రెడ్డి బృందంగా ఏర్పడ్డారు. డిసెంబర్ 9న జలాల్పూర్ నుంచి బూత్ స్థాయి కమిటీ ఎన్నుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రూరల్ మండలంలోని 19 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 30 బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తిచేశారు.