క్షణికావేశం దారుణానికి పురిగొల్పింది. గర్భిణి అని కూడా చూడకుండా భర్తే ఆమెను దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను కూడా అదే గొడ్డలితో తలపై కొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. మద్యానికి బానిసైన సంజీవులు (30) నిత్యం కుటుంబ సభ్యులను వేధించే వాడు. గురువారం కూడా ఇంట్లో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఐదు నెలల గర్భిణి అయిన భార్య రమ్యశ్రీ(24)పై గొడ్డలితో దాడికి దిగాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి నాలుగేండ్ల కూతురు అనాథగా మారింది.
తాడ్వాయి, ఆగస్టు 25: క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలికాగా.. నాలుగేండ్ల చిన్నారి అనాథగా మారిన సంఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో గురువారం చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు..చిట్యాలకు చెందిన సార్గు పెద్ద నారాయణ, సత్తవ్వలకు పిల్లలు పుట్టక పోవడంతో సంజీవులు(30)ను చిన్నప్పుడే దత్తత తీసుకున్నారు. ఆయన చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉండేవాడు. సంజీవులు ఎటువంటి పని చేయకుండా తాగుడుకు బానిసై జులాయిగా తిరుగుతూ సైకో మాదిరిగా ప్రవర్తించేవాడు. గతంలో తండ్రిపై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. సంజీవులుకు ఆరేళ్ల క్రితం గాంధారి మండలం సర్వపూర్కు చెందిన రమ్యశ్రీతో వివాహం చేశారు. పెండ్లి చేస్తే మారుతాడని అనుకుంటే ఆయనలో ఎలాంటి మార్పూ రాలేదు. సంజీవులు తరుచూ భార్యతో గొడవపడేవాడు. భర్త వేధింపులు భరించలేక రమ్యశ్రీ పుట్టింటికి వెళ్లింది. కుల పెద్దలు ఆమెకు నచ్చజెప్పి నెల రోజుల క్రితమే చిట్యాలకు తీసుకువచ్చారు. ప్రస్తుతం రమ్యశ్రీ ఐదు నెలల గర్భిణి. వీరికి నాలుగేండ్ల కూతురు శాస్త్రిక ఉంది.
గురువారం ఉదయం సంజీవులు తల్లి సత్తవ్వ బయటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య రమ్యశ్రీతో గొడవకు దిగిన సంజీవులు కోపంతో సైకోగా మారాడు. ఇంటి తలుపులు మూసేసి గొడ్డలితో భార్య తలపై దాడి చేశాడు. రమ్యశ్రీ తప్పించుకుని బయటికి రాగా వెంబడించి మరీ దాడి చేశాడు. తల్లి సత్తవ్వకు విషయం తెలియడంతో అక్కడికి చేరుకొని కేకలు వేయగా సంజీవులు సైతం గొడ్డలితో గొంతు కోసుకున్నాడు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపు రమ్యశ్రీ మృతి చెందింది. సంజీవులు కొంతదూరం పరిగెత్తుకుంటూ వెళ్లి కింద పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకొని కొనఊపిరితో ఉన్న సంజీవులును కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. రమ్యశ్రీ తండ్రి గంట రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఏఎస్సై సంజీవరావు తెలిపారు. అనాథగా మారిన చిన్నారి శాస్త్రికను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.
ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి బాలుడి మృతి
పహాడీషరీఫ్, ఆగస్టు 25: ఆడుకుంటూ వెళ్లి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై మధుసూదన్ కథనం మేరకు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాయిలుకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సాయిలు కుటుంబం నాలుగేండ్ల క్రితం హైదరాబాద్ వెళ్లింది. జల్పల్లిలో ఇంటిని అద్దెకు తీసుకుని కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయిలు, ఆయన భార్య కుమారుడు అర్జున్(3)ను వెంట తీసుకుని ఓ ఇంటి నిర్మాణ పనికి వెళ్లారు. కుమారుడిని కింద వదిలేసి ఇంటిపైన పనిలో నిమగ్నమయ్యారు. ఆ బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడి మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.