గాంధారి, మే 26: అటవీ భూముల కోసం రెండు తండాలకు చెందిన వారు గొడవలకు దిగిన సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం చోటు చేసుకున్నది. గాంధారి మండలం కొత్తబాది తండా, సోమారం తండాలకు చెందిన పలువురు రైతులు పోడుపట్టాలను పొందారు. ఈ పట్టాలను అడ్డం పెట్టుకొని చాలా మంది యథేచ్ఛగా అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. భూములను ఆక్రమించే క్రమంలో ఒకరి తండా శివారులోకి మరొకరు వెళ్లడం గొడవలకు దారితీసింది.
కొత్తబాది, సోమారం తండాల్లో చాలా మంది 5 నుంచి 10 ఎకరాల వరకు పోడు పట్టాలను పొందారు. దీంతో ఆగకుండా కొత్తగా అటవీ భూముల్లోని చెట్లను నరికివేస్తూ ఆక్రమిస్తున్నారు. ఆ భూములు తమవి అంటే తమవని రెండు తండాలకు చెందిన వారు గొడవలకు దిగారు. అటవీ భూముల కోసం రెండు తండాలకు చెందిన వారు గొడవలు పడుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులకు ఏమీ తెలియనట్లు ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. గాంధారి మండలంలోని చద్మల్తండా, నాగ్లూర్ తండా, నేరల్తండా,బీర్మల్ తండా, కొత్తబాది తండా, సోమారంతండా, గండివేట్, సీతాయిపల్లి, పేట్ సంగెం, పొతంగల్ కలాన్, కాటేవాడీ, కర్ణం గడ్డ తండాల్లో వేలాది ఎకరాల అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి.