ఎల్లారెడ్డి, జనవరి 30: ఎమ్మెల్యేలు అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అన్ని హంగులతో నూతన భవనాలు నిర్మించగా.. ఎన్నికల వరకు సందడిగా ఉండేవి. నిత్యం వచ్చే ప్రజలతో కార్యాలయాలు కళకళలాడేవి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా కొన్నిచోట్ల వాస్తు దోషం పేరిట క్యాంపు ఆఫీసులను ఇప్పటివరకు తెరవకపోవడం గమనార్హం. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూడా మూసి ఉండగా.. ఏదైనా పని నిమిత్తం వెళ్లినవారికి గేటుకు వేసిన తాళం దర్శనమిస్తోంది.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా జాజాల సురేందర్ ఉన్నప్పుడు క్యాంపు కార్యాలయంలోనే అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్ ఇప్పటివరకు క్యాం పు కార్యాలయం వైపు చూడకపోవడం గమనార్హం. రోడ్డుకు ఎత్తులో ఉండాల్సిన భవనం కిందికి ఉందని, ఇది పూర్తిగా వాస్తుకు పనికి రాదని వాస్తు పండితులు చెప్పడంతో తన నివాసంలోనే క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ ఆఫీస్ కూడా వాస్తు ప్రకారం లేదంటూ ఇప్పటి వరకు దానిని కూడా తెరవకపోవడం గమనార్హం.