నిజాంసాగర్, జనవరి 17: విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం (2024-25)లో ప్రవేశాలకు ఈ నెల 20వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరో తరగతిలో కేవలం 80 సీట్లు ఉండగా 5252 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ప్రవేశాల్లో గ్రామీణ విద్యార్థులకు అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. మొత్తం సీట్లలో 75 శాతం గ్రామీణలు, 25 శాతం ఓపెన్ కోటా కింద కేటాయిస్తారు. ఈనెల 20న ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ప్రశ్నలన్నింటికీ అబ్జెక్టివ్ రూపంలో సమాధానాలు ఉంటాయి. రెండు గంటల వ్యవధిలోమూడు విభాగాల్లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ-3, దోమకొండ-2, కామారెడ్డి-4, బిచ్కుంద-3, ఎల్లారెడ్డి-2 మొత్తం 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,689 మంది దరఖాస్తు చేసుకున్నారు.నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ -4, ఆర్మూర్-3, కమ్మర్పల్లి -1, భీమ్గల్ -2, బోధన్-3 మొత్తం 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,563 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షను కామారెడ్డి , నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు పర్యవేక్షించనున్నారు. ఇన్విజిలేటర్లు, సీఎల్వోలు, సీఎస్లతోపాటు ప్రతి గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు 45 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి హజరుకావాలని అధికారులు సూచించారు.
ఖలీల్వాడి, జనవరి 17 : గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త సంపత్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ప్రవేశపరీక్ష ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, బోనాఫైడ్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
హాల్టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. ఆన్లైన్లో హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే నవోదయ పాఠశాలలో లేదా హెల్ప్లైన్ నంబర్ 73820 86533లో సంప్రదించాలి.విద్యార్థులు హాల్టికెట్, బాల్పెన్( బ్లూ లే దా బ్లాక్) తో పాటు పరీక్షా ప్యాడ్ను మాత్రమే తీసుకురావాలి.