ఇందల్వాయి, ఏప్రిల్ 14 : ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించగా.. ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసిందని మండిపడ్డారు. పేదలకు కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇప్పటి వరకు ఎందరికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు పెన్షన్, రైతులకు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్కసారి కూడా కరెంట్ పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో తరచూ కరెంట్ పోతుందని రైతులు తన దృష్టికి తీసుకవచ్చినట్లు బాజిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని రోజులు పరిపాలిస్తుందో ఆ పార్టీ నాయకులకే తెలియదన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారి గురించి ఆలోచించకుండా గెలుపు కోసమే ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్, ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. తనకు మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఓట్లు రావాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తన గెలుపునకు పునాదులవుతాయని తెలిపారు. తనను ఆశీర్వదిస్తే ఢిల్లీలో తెలంగాణపై మాట్లాడే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే తప్పక విజయం సాధిస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ కుంచాల విమల రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.