నవీపేట, జనవరి 21: విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నదని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్రెడ్డి అన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నవీపేట మండలంలోని లింగాపూర్, నిజాంపూర్, నాళేశ్వర్, తుంగినిలో ఆదివారం పర్యటించిన ఎమ్మెల్యే.. బినోలాలో రూ.70కోట్లతో నిర్మించిన వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అధికారులకు సూచించారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేసే గంజాయి, పేకాటతోపాటు బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్లను కేజ్వీల్ ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్నారని, అందుకు కారణమైన ట్రాక్టర్ల యజమానులతోపాటు డ్రైవర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిజాంపూర్ నుంచి నాళేశ్వర్ వరకు కొనసాగుతున్న డబుల్ బీటీ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. ఏడాదిలోపు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నీరడి సవిత, సొసైటీ చైర్మన్ మగ్గారి హన్మాండ్లు, వైస్ చైర్మన్ బాబర్, కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్రెడ్డి, తాహెర్బిన్ హందాన్, బినోలా సర్పంచ్ పితాంబర్ తదితరులు పాల్గొన్నారు.