నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోలా గ్రామం.. నూటొక్క ఆలయాలకు ప్రసిద్ధి. పక్కనే పరమ పావనమైన గోదావరి ప్రవహిస్తూ ఉత్తర మలుపు తిరగడంతో గ్రామానికి విశిష్టత ఏర్పడింది. రామాయణం రచించిన మహర్షి వాల్మీకి ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్నారని, సమాధి కూడా ఇక్కడే జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. నేడు బినోలా గ్రామంగా కన్పిస్తున్న ఈ ప్రాంతం త్రేతాయుగంలో దండకారణ్యంలో భాగంగా ఉండేదని పూర్వీకులు చెప్పుకుంటారు. వాల్మీకి మహర్షి సంచరించిన సమయంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అందులో శివలింగం, నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నిత్యం గోదావరి నదిలో పుణ్యస్నానం చేసి అనుష్టాన కార్యక్రమాలు నిర్వహించుకునే వారు. ఒకప్పుడు ఈ గ్రామంలో 101 దేవాలయాలు ఉండేవి. చాలా ఆలయాలు శిథిలావస్థకు చేరుకొని కనుమరుగయ్యాయి. ప్రస్తుతం 36 దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడానికి గ్రామానికి చెందిన పురోహితులు కృష్ణ ప్రసాద్ జోషి ఆధ్వర్యంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆలయాలు కొన్ని వందల ఏండ్ల క్రితం నుంచి ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. వీటిని ఎప్పుడు? ఎవరు? నిర్మించారో స్పష్టమైన సమాచారం లేదు. ఇదిలా ఉండగా పూర్వం వనాలగా పేరొందిన బినోలాలో 300కు పైగా బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఆ సమయంలో ఈ ఆలయాలు శిథిలావస్థలో ఉండేవి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి ప్రతిబింబంగా నవీపేట మండలంలోని బినోలా గ్రామం పేరు ప్రఖ్యాతిగాంచింది. కాశీలోని సిద్ధ ఆలయాలు, దైవ సమానులు జగద్గురు శంకరాచార్యులు అడుగీడిన ప్రదేశంగా విరాజిల్లుతున్నది. గతంలో వానోలాగా ప్రసిద్ధి చెందిన ఈ గ్రామమే రానురాను బినోలాగా పేరొందింది. గ్రామంలో ఆధ్యాత్మిక చింతనతోపాటు పురాణ ఇతిహాస గాథలు చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఇక్కడి ఆనవాళ్లు అబ్బురపరుస్తున్నాయి.
కాశీలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో ఇక్కడ కూడా అన్ని దేవాలయాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆనాడు రజాకార్లు ధ్వంసం చేస్తున్న సమయంలో ఇక్కడి వేద బ్రహ్మణోత్తములు ఆలయంలోని దేవతామూర్తులను ఇండ్లలోకి తీసుకువచ్చి భద్రపరిచారని చెబుతున్నారు. కాలక్రమేనా అవి కాలగర్భంలో కూరుకుపోయాయి. ప్రస్తుతం బయటపడుతున్నాయి. దాదాపు 40కిపైగా దేవతామూర్తులు దర్శనమిస్తున్నాయి. కాగా 40ఏండ్ల క్రితం గ్రామస్తులు సాగునీటి కోసం చెరువు కట్ట వెంబడి కాలువను తవ్వగా ఆ సమయంలో 12అడుగుల భారీ జైన మహవీర్ దిగంబర విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని హనుమాన్ ఆలయం వద్ద ఉంచి మందిర నిర్మాణం చేపట్టారు. దీంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికతోపాటు చరిత్ర ఆనవాళ్లు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు.
బినోలా గ్రామంలో శతాబ్దాల కిందట 300 బ్రాహ్మణ కుటుంబాలు జీవనం కొనసాగించాయట. లోక కల్యాణ కోసం సంచారం చేస్తున్న జగద్గురు శంకరాచార్యులు ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఆయనను ఇక్కడి బ్రహ్మణోత్తములు పట్టించుకోకపోవడంతో కోపోద్రిక్తుడైన శంకరాచార్యులు వారిని శపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అన్ని కుటుంబాలు ఖాళీ అయిపోయి ప్రస్తుతం ఒకే ఒక కుటుంబం జీవనం కొనసాగిస్తున్నది.
గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నాం. నా సంపాదనతోపాటు దాతల సహకారంతో ఆలయాల పునర్నిర్మాణం చేపడుతున్నాం. గతంలో బినోలాలో 100కు పైగా దేవాలయాలు ఉండేవని చరిత్ర చెబుతున్నది. కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకొని కనిపించకుండా పోయాయి. అవన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. వాటన్నింటినీ పునరుద్ధరించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. ఇప్పటి వరకు గ్రామస్తుల సహకారంతో 15 దేవాలయాలను నిర్మించాం.
కొన్నేండ్ల క్రితం ఓ సాధువు సంచారం చేస్తూ బినోలా గ్రామానికి వచ్చాడు. వృక్షాన్ని చూసి ఎంతో మహిమ గల వృక్షమని, దీనిని నిత్యం పూజించిన వారికి మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభాలతోపాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తాయని చెప్పారట. ఇలాంటి వృక్షం కాశీలో ఉన్నదని, మళ్లీ ఇక్కడ దర్శించానని చెప్పినట్లు పురాణ కథలు చెబుతున్నాయి. ఈ వృక్షం మొదలు నుంచి కాండం వరకు విబూది రేకులుగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వచ్చి వృక్షాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కాణిపాకంలో వినాయకుడు బావి నుంచి ఉద్భవించినట్లు ఇక్కడ కూడా వినాయకుడి గర్భగుడి లోతుగా ఉంటుంది. తమ కోరికలు నెరవేరడానికి భక్తులు సిందూరం సమర్పిస్తారు. ఆలయంలో వినాయకుడి ఎదురుగా చక్కని ఏనుగు విగ్రహం ఉన్నది. పక్కనే ఉన్న కోనేరులో స్నానం చేస్తే అన్నిరకాల చర్మ వ్యాధులు పోతాయని భక్తులు విశేషంగా నమ్ముతారు