నిజామాబాద్ స్పోర్ట్స్, జనవరి 11 : తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సీపీ కల్మేశ్వర్, డీఎఫ్వో వికాస్మీనాతో కలిసి గురువారం హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా హరితహారం కింద నాటాల్సిన మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రతిపాదనలు రూపొందించారు. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సాధించేందుకు చొరవ చూపాలని సూచించారు. 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాల సాధన కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. హరితహారం అమలుతీరును పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. రోడ్లకిరువైపులా ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలను గమనించి, వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. మొక్కలకు జియో ట్యాగింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు. పోలీసు శాఖకు మొక్కలు పెంచేందుకు వీలుగా స్థలం లేనందున, నగర శివారులో 5 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను కేటాయిస్తామని, ఆ స్థలంలో మొక్కలు నాటేందుకు చొరవ చూపాలని డీఎఫ్వో వికాస్మీనా కోరారు. నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు డీసీపీ జయరాం, ప్రొబేషనరీ ఐపీఎస్ బి.చైతన్య, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ పాల్గొన్నారు.
నిజామాబాద్ స్పోర్ట్స్, జనవరి 11 : స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్యసాహసాలు అనన్య సామాన్యమైనవని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు కీర్తించారు. కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వడ్డె ఓబన్న 208 జయంతిని గురువారం అధికారికంగా నిర్వహించారు. వడ్డె ఓబన్న చిత్రపటానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రేనాడు ప్రాంతంలో జన్మించిన ఓబన్న.. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జరిపిన సాయుధపోరులో సైన్యాధ్యక్షుడిగా వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేశ్, వివిధ సంఘాల ప్రతినిధులు దండి వెంకట్, వెంకటేశ్, నగేశ్, శంకర్, బుస్సా ఆంజనేయులు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.