విద్యానగర్/ఖలీల్వాడి, జనవరి 27 : టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లతో ‘మన ఊరు-మనబడి’, బదిలీలపై సమీక్ష నిర్వహించారు. బదిలీల్లో ఎలాంటి అవినీతికి అస్కారం లేకుండా చూడాలన్నారు. పదోన్నతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ‘మన ఊరు-మనబడి’ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు.
కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద 13 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమైనట్లు చెప్పారు. నిజామాబాద్ అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ.. బదిలీలు, పదోన్నతులపై జాబితాలను ప్రదర్శించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. మెడికల్ బోర్డును సైతం ఏర్పాటు చేశామన్నారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులు చాలావరకు పూర్తయినట్లు చెప్పారు.