రుద్రూర్, ఆగస్టు 5: విద్యార్థులకు చదువే ఆయుధమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రస్తుత సమాజంలో కలుషిత ఆహారానికి ప్రజలు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషితం లేకుండా నాణ్యమైన ఆహారం అందించే సత్తా ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు ఉందన్నారు. శుక్రవారం ఆయన రుద్రూర్ మండలంలోని ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో కలియదిరిగారు. కళాశాలలో వివిధ రకాల వంగడాలు, ఆహార పదార్థాల తయారీ గురించి అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాలి, నీరు, ఆహారాన్ని కలుషితం లేకుండా అం దించగలిగితే ఆరోగ్యవంతమైన దేశంగా తయారు చేయవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలాలను తాగుతున్నామని అన్నారు. హరితహారం కార్యక్రమంతో గాలి లో కలుషితాన్ని నివారించగలుగుతున్నామని తెలిపారు. దేశంలో రుద్రూర్ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల పదమూడవదని చెప్పారు. ఈ కళాశాలలో చదివిన 90శాతం మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని అధ్యాపకులు తెలుపడం గర్వంగా ఉందన్నారు. ఎల్లప్పుడు చదువే కాకుండా ఆటపాటలతో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాలని అధ్యాపకులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ స్వామి, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్వర్, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, డాక్టర్ సీమా, జడ్పీటీసీ నారోజీ గంగారాం, సర్పంచ్ గంగమణి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పొతంగల్ను మండలం చేస్తాం: సభాపతి
పొతంగల్ను మండలం చేస్తామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం మండలాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలం ఏర్పాటు చేయాలంటే గ్రామ పం చాయతీల తీర్మానంతోపాటు మండల పరిధిలో ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్నారు. లేకుంటే ప్రభుత్వం ఆమోదించదని చెప్పారు. తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోటగిరి మండలంలోని పొతంగల్ను మండలంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు మండలం ఏర్పాటు చేయాలని ఇష్టపూర్వకంగా తీర్మానం చేయాలన్నారు. కలెక్టర్ ద్వారా రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ప్రతిపాదన చేరిన తరువాతనే మండలాల ఏర్పాటు కొనసాగుతుందని వివరించారు. ఇప్పటి వరకు ఆయా కారణాలతో ప్రతిపాదనలు, తీర్మానాలు సకాలంలో చేరకపోవడంతో ఆలస్యమైందని తెలిపారు. రెండో విడుత మండలాల ఏర్పాటులో పొతంగల్ మండలం ఏర్పాటు పూర్తి అవుతుందన్నారు. అనవసరంగా తెలిసీ తెలియని నాయకుల మా టలు విని ప్రజలు తప్పుదోవ పట్టొద్దని సూచించారు. మండలం ఏర్పాటు కాకపోతే ధర్నాలు చేస్తామనే నాయకులు ఇప్పటి వరకు తమకు మండలం కావాలని అడిగిన దాఖలాలు లేవన్నారు.