బాల్యం బందీ కాకుండా విద్యాశాఖ భరోసా కల్పిస్తున్నది. వెట్టి చాకిరి నుంచి చిన్నారులకు విముక్తి కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. బడీడు పిల్లలు బాల కార్మికులుగా మగ్గిపోకుండా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బడి బయటి పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. తద్వారా జిల్లాలో నిర్బంధ విద్య కచ్చితంగా అమలయ్యేలా చూస్తున్నారు. వాస్తవానికి చదువుతోనే బాలల బంగారు భవిష్యత్తుకు బాట పడుతుంది. బాల్యం నుంచే విద్య దిక్సూచిగా నిలుస్తుంది. కానీ పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత కారణంగా ఎంతోమంది చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. బడిలో ఉండాల్సిన పిల్లలు బాల కార్మికులుగా మారుతున్నారు. ఇలాంటి వారిపై విద్యాశాఖ స్పెషల్గా ఫోకస్ పెట్టింది. బాల కార్మికులుగా మారిన చిన్నారులను గుర్తించి, వారిని బడుల్లో చేర్పిస్తున్నది. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో పనులు చేయిస్తే చర్యలు తప్పవని ఇటు చిన్నారుల తల్లిదండ్రులకు, అటు పని చేయించుకునే యజమానులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే కాకుండా పేద పిల్లల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నారు.
బడీడు పిల్లలకు ప్రాథమిక విద్య దరి చేరాలనే ఉద్దేశంతో విద్యాశాఖ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. గత కొన్ని రోజులుగా జిల్లాలో బడికి దూరంగా ఉంటూ పనులు చేస్తున్న పిల్లలను బడిలో చేర్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా అందరికీ విద్యా అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. (అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్) ఓఎస్సీ సర్వేను ప్రారంభించారు. ఈ కార్యక్రమం జనవరి 11వ తేదీ వరకు కొనసాగనున్నది. కామారెడ్డి జిల్లాలో బడీడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పిస్తున్నారు. చాలా మంది చిన్నారులు తమ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. కొందరు వ్యాపారులు సైతం చిన్నారులకు తక్కువ వేతనం ఇచ్చి వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. పుస్తకాలు పట్టాల్సిన బాల్యాన్ని తమ పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వారిని సర్వేలో గుర్తించి యజమానులకు,తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నారు.
విద్యా హక్కు చట్టం ప్రకారం 14సంవత్సరాల పిల్లలు పాఠశాలలోనే ఉండాలనే లక్ష్యంతో ఓఎస్సీ సర్వే నిర్వహిస్తున్నారు. పాఠశాలలో కాకుండా బయట ఉన్న పిల్లలను చైల్డ్ లేబర్గా పరిగణిస్తున్నారు. జనవరి 11వ తేదీ వరకు సీఆర్పీలు చిన్నారుల వివరాలను జిల్లా వ్యాప్తంగా సర్వే ద్వారా సేకరిస్తున్నారు. 6-14, 15-19ఏండ్లలోపు వలస కుటుంబాలకు చెందిన పిల్లలను సైతం సర్వేలో నమోదు చేస్తున్నారు. 15-19 ఏండ్ల పిల్లలు బయట ఉంటే ఓపెన్ టెన్త్, ఇంటర్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా వారికి రూ.2వేల రీయింబర్స్మెంట్ను ఈ ఏడాది నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు.
18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు హానికర, రసాయన పరిశ్రమల్లో పని చేయకూడదు. గొర్రెలు కాయడం తదితర పనులు నిర్వర్తించకూడదు. అలా ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే యజమానులు, తల్లిదండ్రులపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కేసులు కూడా పెడతారు.
జనవరి 11 వరకు సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమ కాంప్లెక్స్ పరిధిలోని గ్రామాల్లో బడిబయట పిల్లలను గుర్తించేందుకు ఇంటింటా సర్వే నిర్వహించాలి. రోజూవారీగా గుర్తించిన బడిబయట పిల్లలను ప్రబంధ్ పోర్టల్లో నమోదు చేయాలి. జనవరి 11న మండల స్థాయి బడిబయట సర్వే రిపోర్టును జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. జిల్లా స్థాయిలో పరిశీలించిన బడిబయట పిల్లల వివరాలను జనవరి 12న జిల్లా విద్యాశాఖ అధికారి ధ్రువీకరించి రాష్ట్రస్థాయికి పంపిస్తారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సర్వేలో 34 మందిని గుర్తించారు. వివిధ పనులు చేస్తున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులు, యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లల భవిష్యత్తు, చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని అవగాహన కల్పిస్తున్నారు. బాలల విద్య విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశమున్నదని చెబుతున్నారు.
సీఆర్పీలు, ఐఈఆర్పీలు తమ కాంప్లెక్స్ పరిధిలోని గ్రామాలకు వెళ్లి ఇంటింటా సర్వే నిర్వహించి బడి బయటి పిల్లలను గుర్తించాలి.
6 నుంచి 14, 15 నుంచి 19 ఏండ్ల లోపు బడిబయట పిల్లలను గుర్తించాలి.
ఆ పిల్లలకు విద్య ప్రాముఖ్యతను వివరించి పాఠశాలల్లో చేర్పించాలి.
వేరే రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం వచ్చి పని చేసుకుంటున్న వారి పిల్లల వివరాలు సేకరించాలి.
డ్రాప్బాక్స్లోని విద్యార్థులు ప్రస్తుతం ఏ పాఠశాలలో చదువుతున్నారో సమాచారం సేకరించాలి.
పక్క రాష్ర్టాల్లో ఉండి ప్రస్తుతం సొంత ప్రదేశాలకు వచ్చిన విద్యార్థులను గుర్తించాలి.
విద్యా హక్కు చట్టం ప్రకారం 14 ఏండ్ల పిల్లలు పాఠశాలలోనే ఉండాలి. వారిని ఎలాంటి పనుల్లో ఉంచకూడదు. అలా చేసిన యజమానులు, తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. బడీడు పిల్లలను గుర్తించి తల్లిదండ్రులు, యజమానులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఈ సర్వే వచ్చే నెల 11 వరకు కొనసాగుతుంది.
-రాజు, డీఈవో, కామారెడ్డి