మోర్తాడ్/వేల్పూర్/ఆర్మూర్/మాక్లూర్, మే 7 : బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. బాల్కొండ నియోజకవర్గంలో ఆదివారం మంత్రి ప్రశాంత్రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. వేల్పూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు లక్మ నరేశ్, గంగుల రాజేశ్వర్తోపాటు మండల కేంద్రానికి చెందిన బేల్దారి, యాదవ సంఘ సభ్యులు చేరగా, మంత్రి వారికి గులాబీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్కు మంచి ఆదరణ లభిస్తున్నదని అన్నారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలను యువత ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, బీఆర్ఎస్ మోర్తాడ్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, ఉప సర్పంచ్ రవి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు హన్మంతు, ఆరిఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలం అంకాపూర్లోని ఎమ్మెల్యే జీవన్రెడ్డి నివాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలతోపాటు విశ్వబ్రాహ్మణులు, గొల్లకురుమలు, ధర్మోరా గ్రామానికి చెందిన గోసంగి కులస్తులు భారీ ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వీరికి జీవన్రెడ్డి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో బాగుపడని పల్లె, మేలు జరగని ఇల్లు లేదని అన్నారు. ఏ ఇంట్లో చూసినా సంక్షేమం.. ఏ కంట్లో చూసినా సంతోషమే కనిపిస్తున్నదని అన్నారు. 450 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ ప్రజల దైవమని, సంపదను పెంచి పేదలకు పంచుతున్న జనహృదయ నేత అని అన్నారు. ఆయన పాలనను అన్ని రాష్ర్టాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన సభలకు లక్షల్లో జనం తరలిరావడంతోపాటు బీఆర్ఎస్లో చేరికలే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్రెడ్డి, సర్పంచ్ శైలజా గంగాధర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సురేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.