తగ్గిన దిగుబడి..పెరిగిన డిమాండ్
వారాంతపు సంతల్లో విక్రయాలు
దొడ్డు రకం కిలో రూ.260.. సన్నరకం రూ.320
కమ్మర్పల్లి, మే 29 : ఎండు మిర్చి ఘాటు తగ్గడంలేదు. ఈ సీజన్లో ఎండు మిర్చి ధరలు దాదాపుగా అదే ధరలతో కొనసాగుతున్నాయి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దు ప్రాంత గ్రామాల్లో వారాంతపు సంతల్లో రెండు నెలలుగా ఎండు మిర్చి విక్రయాలు సాగుతున్నాయి. జగిత్యాల జిల్లా కథ్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి ప్రతి ఏటా ఇదే సమయంలో కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, ఏర్గట్ల మండలాల వారాంతపు సంతల్లో ఎండు మిర్చి తెచ్చి రైతులు, మారు బేరపు వ్యాపారులు విక్రయిస్తారు.
గతేడాది వానకాలంలో భారీగా కురిసిన వర్షాలతో దిగుబడులు తగ్గడంతో ఎండు మిర్చికి డిమాండ్ పెరిగింది. రైతులు మార్కెట్లలోనే విక్రయించుకున్నారు. ఈసారి వారాంతపు సంతల్లో రైతుల సందడి కనిపించడం లేదు. మారు బేరపు వ్యాపారులు మాత్రమే విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు నెలల క్రితం సంతల్లోకి వచ్చే నాటికే దొడ్డు రకం ఎండు మిర్చి కిలో ధర రూ.260 నుంచి రూ.240 మధ్య ప్రారంభమైంది. దీంతో గ్రామాల్లో కొనుగోలుదారులు వచ్చే వారానికి ధర తగ్గకపోతుందా అని నాలుగైదు వారాలు ఎదురు చూశారు. కానీ ఈ రెండు నెలల కాలంలో ధర మాత్రం కేవలం రూ.20 మాత్రమే తగ్గింది. సన్న రకం ఎండు మిర్చి ధర రూ.320 కన్నా తగ్గలేదు. గత శనివారం కమ్మర్పల్లి సంతలో దొడ్డు ఎండు మిర్చి కిలో ధర రూ.220 పలికింది. దీంతో ధర ఘాటును భరిస్తూ కొనుగోలు చేస్తున్నారు.