బోధన్, మే 20: బోధన్ పట్టణానికి తాగునీటి కొరత ముప్పు ముంచుకువస్తున్నది. పట్టణానికి ఆనుకొని ఉన్న ‘బెల్లాల్’ చెరువులో నీటిమట్టం గణనీయంగా పడిపోతుండడమే ఇందుకు కారణం. సాగునీటితోపాటు తాగునీటిని అందించే ఈ చెరువు బోధన్ డివిజన్లోనే అతి పెద్ద చెరువు. 1500 ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు బోధన్ పట్టణ ప్రజలకు రెండు పూటలా తాగునీటి సరఫరాకు ఏకైక వనరుగా ఈ చెరువు ఉన్నది. ఏడేండ్లుగా ఈ చెరువులో ఏనాడూ ఇలా నీటిమట్టం తగ్గలేదు. వేసవిలో సైతం బెల్లాల్ చెరువు నీటితో కళకళలాడుతూ కనిపించేది. ప్రణాళిక కొరవడడం, సాగు, తాగునీరు అవసరాలను అంచనావేసి అందుకు అనుగుణంగా చెరువును నిజాంసాగర్ నీటితో నింపే విషయంలో తగిన చర్యలు సకాలంలో చేపట్టని ఫలితంగా ఈ దుస్థితి ఏర్పడింది. అసలే చెరువు ఎండిపోతుండగా, చెరువులో ఉన్న నీటిని కూడా గుర్రపు డెక్క పూర్తిగా కప్పేసింది. గుర్రపు డెక్క చెరువు అంతటా పరుచుకోవడంతో నీటి వృథా పెరుగుతుండడంతోపాటు నీరు కలుషితం అవుతున్నది. ఈ పరిస్థితుల్లో తొలకరిలో కురిసే వర్షాలతో చెరువులోని నీరు మరింతగా కలుషితమై తాగేందుకు పనికిరాని పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అప్పుడు పట్టణంలోని మురికినీటితోపాటు కలుషిత జలాలను శుద్ధిచేయడం ఒక పెద్ద సమస్యగా బోధన్ మున్సిపాలిటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
యాసంగి పంట కోతలు ముగియడంతో ఇప్పుడు బెల్లాల్ చెరువు నుంచి సాగునీటిని అందించాల్సిన అవసరం లేదు. కేవలం తాగునీటిని ఈ చెరువు నుంచి సరఫరా చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు ఎండాకాలంలో తాగునీటికి పట్టణంలో ఇబ్బందులు ఏర్పడలేదు. చెరువులో పుష్కలంగా నీరు ఉండడంతో మున్సిపల్ అధికారులు ఎన్నడూ ఆందోళనపడిన సందర్భాలు లేవు. అయితే గత కొన్ని రోజులుగా బెల్లాల్ చెరువులో నీటిమట్టం గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ చెరువు ఎఫ్టీఎల్ 12 అడుగులు కాగా, ఇప్పుడు నీటిమట్టం 8.5 అడుగులకు పడిపోయింది. ఈ చెరువు పూర్తి నిల్వ సామర్థ్యం 346 ఎంసీఎఫ్టీలు కాగా, ప్రస్తుతం కేవలం 189 ఎంసీఎఫ్టీల నీరు మాత్రమే ఉన్నది. ఈ నీరు వచ్చే జూన్ 15 వరకు సరిపోతుందని మున్సిపల్ అధికారులు అంటున్నప్పటికీ, చెరువు గర్భంలో పెద్ద ఎత్తున వ్యర్థ పదార్థాలతోపాటు గుర్రపుడెక్క, బురద ఉండడంతో ఈ నెలాఖరుకు చెరువులో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు. చెరువు క్రమంగా ఎండిపోతుండడంతో మున్సిపల్ అధికారులు శుక్రవారం బెల్లాల్ చెరువును సందర్శించారు. చెరువు పరిస్థితిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని నిర్ణయించారు. సుమారు లక్షకు పైగా ఉన్న పట్టణ జనాభాకు తాగునీరు అందించేందుకు ఈ చెరువే ఏకైక వనరు. ఇకనైనా, అధికారులు రానున్న రోజుల్లో పట్టణంలో ఏర్పడే తాగునీటి సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరమున్నది.